మూడు రోజులపాటు ఘనంగా మహానాడు
లోకేశ్ నేతృత్వంలో మంత్రులు, నేతల సమావేశం
చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, పల్లా శ్రీనివాసరావు, మంత్రులు
న్యూస్ తెలుగు /వినుకొండ : తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలోనే కనీవినీ ఎరగని రీతిలో ఈసారి మహానాడు ఉండబోతోందని ప్రభుత్వ చీఫ్విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కీలకమైన సమయంలో అనేక సవాళ్లకు ఎదురొడ్డి తిరిగి అధికారంలోకి వచ్చిన సందర్భానికి గుర్తుగా కడప వేదికగా 3 రోజుల పాటు నిర్వ హించబోతున్న మహానాడు పార్టీ అధినాయకత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారాయన. బుధవారం ఈ మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రులు, సీనియర్ నాయకుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, డీబీవీ స్వామి, రామానాయుడు, ఫరూక్, పల్లా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం చీఫ్విప్ జీవీ మాట్లాడుతూ. కడపలో మహానాడు నిర్వహణపైనే ఈ సమావేశంలోనే ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. మే 27, 28 తేదీల్లో ప్రతినిధుల సభ, 29న బహిరంగ సభ నిర్వహణకు అధిష్ఠానం నిర్ణయం తీసుకుందన్నారు. తొలిరోజు టీడీపీ విధివిధానాలు, సిద్దాంతాలు, కార్యాచరణపై , రెండో రోజు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తీర్మానాలపై చర్చ, మూడో రోజు బహిరంగ సభ ఉంటుందన్నారు. మూడు రోజుల కార్యక్రమం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించాలని మంత్రులకు బాధ్యతలు అప్పగించాలని లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనే నిర్ణయించామన్నారు. తుది ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సమావేశంలో లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. వసతి, రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సమావేశంలో తీర్మానించారు.(Story:మూడు రోజులపాటు ఘనంగా మహానాడు)