శివాపురం ప్రమాదంలో కూలీల మృతిపట్ల చీఫ్ విప్ జీవీ తీవ్ర దిగ్భ్రాంతి
వినుకొండ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన
జీవీ, జీడీసీసీ చైర్మన్ మక్కెన, ఎరిక్షన్బాబు
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ నియోజకవర్గం లోని శివాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు మృతిచెందడం పట్ల చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎర్రగొండపాలెం గడ్డమీద పల్లెకు చెందిన పగడాల రామ్ రెడ్డి (40), సుబ్బమ్మ (30), జొన్నగిరి రామాంజి (35), అంకమ్మ ( 30) ఉన్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటినా ఆస్పత్రికి వచ్చిన ఆయన క్షతగాత్రులను పరామర్శించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని, వారికి వర్తించే ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో వినుకొండ మండలం శివాపురం వద్ద రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ భారీ ప్రమాదం చోటుచేసుకుంది. బొప్పాయి వాహనంలో ఉన్న కూలీల్లో ముగ్గురు ఘటనాస్థలిలో మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. మృతులు, బాధితులు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు. వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ యర్రగొండపాలెం బాధ్యుడు గూడూరి ఎరిక్షన్ బాబు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఆర్డీవో మధులత మృతదేహాలను సందర్శించి సంతాపం తెలిపారు. అనంతరం చీఫ్ విప్ జీవీ మాట్లాడుతూ. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు వేగంగా స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారని తెలిపారు. మంత్రి నారా లోకేష్ కూడా స్పందించి ఫోన్ చేశారని, సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని, అలాగే తనకు కూడా సమాచారం అందించారన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా రూ.1.50 లక్షల చొప్పున సాయం అందుతుందని చెప్పారన్నారు. మృతుల కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు జీవీ ఆంజనేయులు చెప్పారు. ఆర్డీవో మధులత మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన బాధితులకు ఉన్నత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి వైద్యం సాయం కావాలన్నా తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ యర్రగొండపాలెం బాధ్యుడు గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, అధికారులు ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారని తెలిపారు. ఈ ప్రమాదాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్, అధికారులకు కూడా తెలియజేశామన్నారు. ప్రభుత్వం తరఫున రావాల్సిన సాయాన్ని త్వరగా అందేలా సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.(story:శివాపురం ప్రమాదంలో కూలీల మృతిపట్ల చీఫ్ విప్ జీవీ తీవ్ర దిగ్భ్రాంతి)