మధ్య భారతం లో ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
న్యూస్తెలుగు/ వనపర్తి : కేంద్రం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి సిపిఐ జిల్లా ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య, టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంకల వెంకట్ నారాయణ, ప్రజాకవి జనజ్వాల, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి శ్రీనివాసులు, ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకులు బలరాం, డిటిఎఫ్ సీనియర్ నాయకులు చిన్న రాములు మాట్లాడారు. మధ్యభారతం 7 రాష్ట్రాల్లో నక్సలైట్ల పేరుతో దాదాపుగా నాలుగు నుంచి 500 మందినిహతమార్చారన్నారు. 2026 లోగా మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్రం బహిరంగంగా ప్రకటించడం దారుణం అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులు చేపట్టిన పాలకులు దానికి వ్యతిరేకంగా దేశ ప్రజలపై యుద్ధం చేస్తూ జీవించే హక్కును హరిస్తున్నారన్నారు. ఆదివాసీల హననాన్ని వెంటనే ఆపాలి అన్నారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలన్నారు. నక్సలైట్ల పేరుతో ఆదివాసీలను అంతమొందించి ఆ రాష్ట్రాల్లో ఉన్న సహజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడమే వారి ఉద్దేశం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నక్సలైట్ల పోరాటాన్ని శాంతిభద్రతల సమస్యగా కాక సామాజిక సమస్యగా చూస్తున్నమని సీఎం పేర్కొనటం హర్షనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం లో రాష్ట్ర ప్రభుత్వం కాల్పుల విరమణ పాటించి ఉద్యమకారులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ, పిడిఎస్యు నేత గణేష్, నాయకులు రమేష్, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. (Story:మధ్య భారతం లో ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి)

