జీవో నెంబర్ 3 ను పునరుద్ధరించాలి
న్యూస్ తెలుగు/సాలూరు : జీవో నెంబర్ 3 ను పునరుద్ధరించి, గిరిజన ప్రాంతాలలో ఉన్న ఉద్యోగాలను గిరిజనుల కే కేటాయించాలని ఆదివాసి గిరిజన సంఘ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. సోమవారం ఆ సంఘం నాయకులు విలేకరులతో మాట్లాడుతూ గిరిజన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నికలు ప్రచారంలో భాగంగా కురుపాం/పాలకొండ/పాడేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయా నియోజకవర్గాల్లో మాట్లాడుతూ జీఓ నంబర్ 3 ను పునరుద్దిస్తామని గిరిజన ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలన్నీ గిరిజనులకే కేటాయిస్తామని చెప్పారని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చిన వాగ్దానం ఏమైందని ఇప్పుడు అది మరిచి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించడంపై గిరిజన సంఘాలు జేఏసీ నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గిరిజన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ గిరిజన ఉపాధ్యాయులు పోస్టులన్నీ డీఎస్సీలో కలిపారని అన్నారు. ఇప్పుడు ప్రకటించిన మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంతానికి సంబంధించిన పోస్టులు గిరిజనుల కేటాయించకుండా జనరల్ లో కేటాయించడంపై గిరిజన నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసి జీవో నెంబర్ 3 పై స్పష్టత ఇవ్వకపోతే గిరిజన నిరుద్యోగులు తరఫున ఆదివాసి ఐక్య గిరిజన సంఘాలు జేఏసీ పోరాటం తప్పదని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాంఅని చెప్పారు . కార్యక్రమంలో జేఏసీ నాయకులు దుఃఖ సీతారాం, ఆరిక చంద్రశేఖర్, జట్ల బంగార్రాజు, ఊర్లకు మల్లయ్య, ఊలక మధుసూదన్ రావు, లోకనాదం తదితరులు పాల్గొన్నారు. (Story : జీవో నెంబర్ 3 ను పునరుద్ధరించాలి)
