క్రమశిక్షణ, అంకితభావాల్లో నేటితరానికి మార్గదర్శి గన్నమనేని వెంకయ్య
విగ్రహావిష్కరణలో ఆయన సేవల్ని కొనియాడిన ఎంపీ లావు, చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు /వినుకొండ : ప్రజా జీవితం, రాజకీయాల్లా క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే విషయంలో గన్నమనేని వెంకయ్య నేటితరానికి మార్గదర్శి అని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అధికారం లో ఉన్నా లేకున్నా నిజమైన కార్యకర్తగా, నాయకుడిగా వెంకయ్య సేవలు వెలకట్టలేనివి అన్నారు. వినుకొండ పట్టణంలోని వెన్నెల సూపర్ మార్కెట్ ఎదురుగా కాలువ కట్ట వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గన్నమనేని వెంకయ్య విగ్రహాన్ని శనివారం వారివురు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మా రెడ్డి మరో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ వెంకయ్య విగ్రహం ఏర్పాటుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. మిలటరీ నుంచి వచ్చి సర్పంచ్గా, మండలస్థాయి నాయకుడిగా, మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్గా ఆయన ఎదిగిన క్రమంలో వెంకయ్య అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్లారన్నారు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీతో పాటు వ్యక్తిగతంగా తనకూ తీరని లోటని నివాళులు అర్పించారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన మరసటి రోజే వచ్చి పార్టీ ఆఫీస్ వద్ద కూర్చుకుని వైకాపా ప్రభుత్వం నియంత పోకడలకు ఎదురునిలిచి పోరాడారన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. గన్నమనేని వెంకయ్య సేవల్ని స్మరించుకున్నారు. ఆయన నిబద్ధత, కార్యదీక్ష ఆదర్శనీయం, వారి ఆశయాలు కొనసాగించడం మనందరి బాధ్యత అన్నారు. ప్రజల కోసం పని చేసినవారికి మాత్రమే వెంకయ్య తరహాలో గౌరవం లభిస్తుందని.. నేటి తరం అందరికీ అదే స్ఫూర్తి కావాలన్నారు. ఆయనకు ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా నిజమైన నివాళి ఇచ్చినట్లు అవుతుందన్నారు. సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కామ్రేడ్, ఏ. మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ. గన్నమనేని వెంకయ్య పార్టీ వేరైనా తనకెంతో ఆప్తులుగా ఉండేవారని. ఆయన ఆర్మీలో పనిచేసి వచ్చిన అనంతరం టిడిపిలో చేరి ఈపూరు మండలంలో పలు సమస్యాత్మక గ్రామాలలో ఇరు వర్గాల ఘర్షణలను చాకచక్యంగా పరిష్కరించి ప్రశాంత వాతావరణానికి కృషి చేసేవారని అన్నారు. అలాగే వెంకయ్య వినుకొండ వచ్చిన నాటి నుండి కమ్యూనిస్టు పార్టీలతోకలసి మెలసి ఉంటూ ప్రజా సమస్యలపై చేపట్టే ఉద్యమాలలో వెంకయ్య కూడా ఆ పార్టీ తరఫున ముందుకు వచ్చి తమ గళం వినిపిస్తూ సంఘ వ్యతిరేక శక్తులపై ఆర్మీ సైనికునిలా పోరాడే వారన్నారు. గన్నమనేని వెంకయ్య మన మధ్య లేకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, బిజెపి ఇన్ ఛార్జ్ యార్లగడ్డ లెనిన్ కుమార్, జనసేన నాయకులు నాగ శీను రాయల్, నిస్శంకర శ్రీనివాసరావు, రాపర్ల జగ్గారావు, టిడిపి రాష్ట్ర లీగల్ సెల్ లాయర్ ఎన్.రామకోటేశ్వరరావు, లాయర్ సైదారావు, మండల పార్టీ అధ్యక్షులు తిరుమల శెట్టి బాలయ్య, పి.వి.సురేష్ బాబు, అయినాల కోటేశ్వరరావు, వేణు, కాటన్ కోటేశ్వరరావు కిషోర్, గన్నమనేని కుటుంబ సంభ్యులు అలాగే టిడిపి శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. (Story:క్రమశిక్షణ, అంకితభావాల్లో నేటితరానికి మార్గదర్శి గన్నమనేని వెంకయ్య)

