వెనకబడిన వర్గాల మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే
న్యూస్ తెలుగు/వనపర్తి : వెనకబడిన వర్గాల కోసమే కాకుండా, మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే అని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 199 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం తో కలిసి మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెనకబడిన వర్గాల కోసమే కాకుండా, మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే అన్నారు. సామాజిక న్యాయమే ధ్యేయంగా ఆయన అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలు, లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మహాత్మ జ్యోతిబాపూలే మహిళలకు విద్య తప్పనిసరి అని భావించి ప్రోత్సహించారని చెప్పారు. పూలే తన సతీమణి సావిత్రిబాయికి విద్యార్థులు నేర్పించి దేశంలో మొదటి బాలికల పాఠశాలను నెలకొల్పినట్లు గుర్తు చేశారు. ఆర్థికంగా బాగున్నప్పుడే సామాజిక న్యాయం కోసం మనం పోరాడగలమని చెప్పిన కలెక్టర్, జ్యోతిబాపూలే ఆ రోజుల్లోనే పూణే నగరానికి మున్సిపల్ కమిషనర్ గా పనిచేసినట్లు గుర్తు చేశారు. మనదేశంలో మహాత్మా అనే బిరుదు ఇద్దరు మహనీయులకు మాత్రమే దక్కిందని అందులో ఒకరు మహాత్మా గాంధీ అయితే, మరొకరు మహాత్మ జ్యోతిబాపూలే అని చెప్పారు. జ్యోతిబాపూలే రాసిన కవితలు, పుస్తకాలు అందరూ చదివి ఆయనను ఆదర్శంగా తీసుకొని జీవితంలో గొప్పగా ఎదగాలన్నారు.అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ఎంచుకున్న మార్గం, ఆయన బోధనలు అందరికీ ఆచరణీయమని తెలిపారు. జ్యోతిబాపూలే 199వ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మ జ్యోతిబాపూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే ఇద్దరు సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో సేవ చేశారని కొనియాడారు. దేశంలో మొట్టమొదటి బాలిక పాఠశాల వీరి కృషితోనే సాకారం అయిందని అన్నారు. వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఆర్డీవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 1827 లో మహారాష్ట్రలో జన్మించిన జ్యోతిబాపూలే, సమాజంలో అసమానతలు తొలగించడానికి ఎన్నో ఉద్యమాలు చేశారని కొనియాడారు.బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు రాచాల యుగేందర్ గౌడ్ మాట్లాడుతూ జ్యోతిబాపూలే ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జ్యోతిబాపూలే దంపతులు చేసిన సేవను గుర్తు చేసుకుంటూ వారిని దేశంలో అత్యున్నత పురస్కారంతో గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు గంధం నాగరాజు, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.(Story : వెనకబడిన వర్గాల మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే )
