భగత్ సింగ్ వర్ధంతి గోడపత్రికల విడుదల
ఎఐవైఎఫ్
న్యూస్తెలుగు/వనపర్తి : వనపర్తి లో మార్చి 23న భగత్ సింగ్ 94 వర్ధంతి నేపథ్యంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వనపర్తి ఆఫీస్ వద్ద భగత్ సింగ్ వర్ధంతి గోడ పత్రికలను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎత్తం మహేష్ మాట్లాడారు.దేశ స్వాతంత్రం కోసం భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని గర్జించిన భగత్ సింగ్ దేశ ప్రజల కోసం ఉరికొయ్యను ముద్దాడారని, ఆయన ఆశయ స్ఫూర్తితో సమాజ మార్పు కోసం కృషి చేయాలన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలు, సెమినార్లు, చెకుముకి టాలెంట్ టెస్ట్ లు నిర్వహిస్తున్నారన్నారు. యువత డ్రగ్స్ మత్తుపదార్థాలకు బానిసలు కావద్దని, రాజకీయ నేతల స్వార్థ రాజకీయాల వలలో పడవద్దన్నారు. తాగుడు, మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు బానిసలను చేస్తున్నారన్నారు. దేశ ప్రగతి కోసం, అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాడాలన్నారు. మార్చి 23న జరిగే భగత్ సింగ్ వర్ధంతి ఉత్సవాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా ఇన్చార్జి రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విష్ణు, చందు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేష్, వనపర్తి డివిజన్ కార్యదర్శి వంశీ, పల్లవి తదితరులు పాల్గొన్నారు. (Story : భగత్ సింగ్ వర్ధంతి గోడపత్రికల విడుదల)