సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలి : కళావతమ్మ
న్యూస్తెలుగు/వనపర్తి : సంఘసంస్కర్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలని ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ కళావతమ్మ, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం వనపర్తి పట్టణం శ్వేతా నగర్ ఆఫీస్ లో సావిత్రిబాయి పూలే వర్ధంతిని NFIW ఆధ్వర్యంలో నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. సంఘసంస్కర్త అయిన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో విద్యనభ్యసించి దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేశారన్నారు. మహిళలు, బాలికలకు విద్య అవసరం లేదన్న బ్రాహ్మణ వాదాన్ని బద్దలు కొడుతూ బాలికలకు ప్రత్యేక పాఠశాలలు స్థాపించి చదువు చెప్పారన్నారు. బ్రాహ్మణవాదులు మనువాదులు దాడులు చేసిన వెనక్కి తగ్గని ధీరవనిత సావిత్రిబాయి పూలే ఆమె అడుగు జాడలలో అందరం నడవాలన్నారు. సంఘసంస్కర్తలు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మనువాదాన్ని, బ్రాహ్మణవాదాన్ని తిరస్కరించగా, బిజెపి ప్రభుత్వం అదే మన ధర్మ సిద్ధాంతాన్ని భారత దేశంలో అమలు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా బిజెపి కుట్రను తిప్పికొట్టేందుకు ప్రజలు, అభ్యుదయ వాదులు, మహిళా లోకం ప్రతిన పూనాలన్నారు. ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ పట్టణ కోకన్వీనర్ శిరీష, శ్రీదేవి, జ్యోతి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్, సిపిఐ నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. (Story : సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలి : కళావతమ్మ)