ప్లీజ్..ప్లీజ్..ఒక్క ఛాన్స్ ఇవ్వరూ!
అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావాహుల కోలాహలం
చంద్రబాబు, లోకేష్ వద్దకు క్యూ
కొమ్మాలపాటి శ్రీధర్ వర్సెస్ దేవినేని ఉమా
జనసేన నుంచి నాగబాబుకు బెర్త్
యనమలకు తిరిగి చోటు దక్కుతుందా ?
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్తో సందడి
న్యూస్ తెలుగు/అమరావతి: ఏపీలో తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీకావడంతో కూటమి పార్టీల(టీడీపీ, జనసేన, బీజేపీ) నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రధానంగా టీడీపీ నేతలు వరుస వారీగా సీఎం చంద్రబాబు నాయుడును, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలుస్తున్నారు. ‘ప్లీజ్..ప్లీజ్..నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి..పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను..’ అని విజ్ఞప్తులు పెద్దఎత్తున చేస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు, లోకేష్ పేషీల దగ్గర పార్టీ నేతల తాకిడి పెరిగింది. అసెంబ్లీ లాబీయింగ్కు ఎమ్మెల్సీ టిక్కెట్లు ఆశిస్తున్న కొమ్మాలపాటి శ్రీధర్, బీదా రవిచంద్రన్ యాదవ్, బుద్దా వెంకన్న, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, పి.అశోక్బాబు, ఏరాసు ప్రతాప్రెడ్డి, మల్లెల లింగారెడ్డి, జంగా కృష్ణమూర్తి తదితరులు వెళ్లారు. ఖాళీ అయిన ఐదు టీడీపీ ఎమ్మెల్సీ స్థానాల్లో తిరిగి వారే ఎన్నిక కానున్నారు. ఈనెల 29తో పదవీ విరమణ చేయనున్న జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ విరమణ చేయనున్నారు. వారిలో కొందరు మళ్లీ తమకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబుకు, లోకేష్కు విన్నవిస్తున్నారు. ప్రస్తుతం కూటమి పార్టీలకు అత్యధిక ఎమ్మెల్యేలు ఉండటంతో..ఈ ఐదు స్థానాలను వారే కైవసం చేసుకోగలరు. వైసీపీకి కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు ఉండటంతో ఒక్క సీటూ వచ్చే పరిస్థితులు లేవు. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో జనసేనకు ఒకటి కేటాయించగా..దానిని నాగబాబుకు దాదాపు ఖరారైంది. మిగిలిన నాలుగు ప్రస్తుత సమాచారం ఆధారంగా టీడీపీ వారితోనే భర్తీ చేసే పరిస్థితులున్నాయి. ఈ నాలుగు స్థానాల్లో ఒకటి కమ్మ సామాజిక వర్గానికి కేటాయించి, మిగిలినవి వివిధ సామాజిక వర్గాల వారీగా భర్తీ చేసే ఆలోచనలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీ టిక్కెట్ను ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు పార్టీ టిక్కెట్ ఇవ్వకుండా..వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కు కేటాయించారు. గుంటూరు జిల్లా నుంచి ఇదే సామాజిక వర్గం నుంచి కొమ్మాలపాటి శ్రీధర్ ఎమ్మెల్సీ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. ఈయనకూ సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో కమ్మ సామాజిక వర్గంలో ఎమ్మెల్సీ శ్రీధర్కు వరిస్తుందా?, లేక దేవినేని ఉమాకు వస్తుందా? అనేదీ రసవత్తరంగా మారింది. వారిద్దరూ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సీఎం చంద్రబాబును శ్రీధర్ కలవగా, లోకేష్ను దేవినేని ఉమా కలిసి ఎమ్మెల్సీ ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.
జనసేన నుంచి నాగబాబు..బీజేపీకి నో టిక్కెట్!
జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు దాదాపు ఖరారైంది. ఇటీవల జరిగిన జనసేన పార్టీ సమావేశంలో నాగబాబు పేరును పార్టీ ప్రకటించింది. నాగబాబుకు బెర్త్ ఖరారవ్వడంతో..ఇక రాబోయే రోజుల్లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై, ఆ తర్వాత మంత్రిగా పగ్గాలు చేపట్టే రోజులు దగ్గరపడుతున్నాయి. నాగబాబుకు సీటు ఖరారు చేయడంతో జనసేన శ్రేణులు ఆనందంతో ఉన్నారు. బీజేపీ ఒక్క ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నప్పటికీ, అది వారికి ఇచ్చే పరిస్థితులు లేవని చంద్రబాబు తెగేసి చెప్పినట్లు సమాచారం. దానికి కారణం టీడీపీ నుంచి అధికంగా పార్టీ నేతల పోటీ ఉండటమే. జనసేనకు కేటాయించగా..ఇక మిగిలిన 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఆశావాహులు పెద్దఎత్తున పోటీపడుతున్నారు. ఈ నాలుగు సీట్లను నాలుగు సామాజిక వర్గాలకు కేటాయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఆయా సామాజిక వర్గాల నుంచి పెద్దఎత్తున నేతలు అసెంబ్లీ లాబీల్లో వచ్చి చంద్రబాబును, లోకేష్ను కలిసి ప్రసన్నం చేసుకుంటున్నారు. ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు మార్చి 4వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ 10వ తేదీతో ముగియనుంది. ఇంతవరకు కూటమి అభ్యర్థుల పేర్లను ఖరారు చేయలేదు.
తాగ్యాలు చేసిన వారికే ప్రథమ ప్రాధాన్యత
2024 ఎన్నికల్లో టిక్కెట్లు త్యాగాలు చేసిన వారికే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జవహర్ అసెంబ్లీ లాబీకి వచ్చి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తనకు బీసీ సామాజిక కోటాలో టిక్కెట్ ఇవ్వాలని బుద్దా వెంకన్న పట్టుపడుతున్నారు. ఐదేళ్లుగా పార్టీలో అందరూ దూరంగా ఉంటే..తాను ఒక్కడినే కష్టపడి పనిచేశానని ఆయన చెప్పుకుంటున్నారు. నాడు చంద్రబాబు ఇంటిపై అప్పటి మంత్రి జోగి రమేష్ దాడి చేసినప్పుడు అక్కడకు బుద్దా వెంకన్న వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. మూడు రాజధానుల అంశంలో శాసన మండలిలో ఎమ్మెల్సీలను సమన్వయం చేసిన వ్యవహారంలోనూ క్రియాశీలంగా వ్యవహరించానని, ఆ దిశగా తనకే ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబుకు బుద్దా వెంకన్న విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీగా రాజీనామా చేసిన మోపిదేవి వెంకట రమణకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలన్న ప్రతిపాదనలున్నాయి. తాజాగా రిటైర్ అవుతున్న వారిలో తిరిగి యనమల రామకృష్ణుడుకు ఎమ్మెల్సీగా మళ్లీ అవకాశం దక్కే పరిస్థితులు కన్పిస్తున్నాయి. యనమలకు ఈ సారి ఎమ్మెల్సీ టిక్కెట్ రాకపోతే ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది. రిటైర్ అయిన ఎమ్మెల్సీలకు రెన్యువల్ ఉండదని చెబుతున్నప్పటికీ, టీడీపీలో అంతర్గత చర్చల ద్వారా మళ్లీ యనమలతోపాటు మరొకరికి ఎమ్మెల్సీ దక్కే పరిస్థితులున్నాయి. యనమల తన మనసులోని మాటను ఇంతవరకు బయటపెట్టలేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలపై అభ్యర్థుల ఎంపిక టీడీపీకి పెద్ద సవాల్గా మారింది. (Story: ప్లీజ్..ప్లీజ్..ఒక్క ఛాన్స్ ఇవ్వరూ!)
Follow the Stories:
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!