కనువిందు చేయనున్న సరికొత్త పర్యాటక కేంద్రం
న్యూస్ తెలుగు/ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో సరికొత్త పర్యాటక ప్రదేశం కనువిందు చేయబోతోంది. ఇందులో భాగంగా అధికార యంత్రాంగం అవసరమైన కసరత్తును ప్రారంభించింది. పచ్చని అడవి, ఆహ్లాదకరమైన వాతావరణంలో కనువిందు చేస్తున్న పులిగుండాల ప్రాజెక్టును ఎకో టూరిజం ప్రాంతంగా మార్చేందుకు సిద్ద పడ్డారు. ఈ ప్రాజెక్టును ఫిబ్రవరి నుండి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టుతున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్, సత్తుపల్లి డివిజన్ తల్లాడ పరిధిలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ పులిగుండాల ప్రాజెక్ట్ ను ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి పరిశీలించారు. దాదాపు 5 కిలోమీటర్లు అటవీ మార్గం ద్వారా కాలినడకన వాగులు, వంకలు దాటుతూ, గుట్టపైకి ఎక్కి పులిగుండాలను కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు సందర్శించారు.
ఎకో టూరిజం ప్రణాళికలో భాగంగా కలెక్టర్ కమాండర్ జీపులో ప్రయాణించి పచ్చని సోయగంతో ఉన్న అటవీని సంరక్షిస్తూ ఇక్కడ ఆహ్లాదకరమైన పరిస్థితులు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ కోసం మొత్తం ఏరియాని పరిశీలించారు. పాలపిట్ట ఓరియల్ టవర్ ఎక్కి బైనాక్యులర్ ద్వారా చుట్టుపక్కల ఏరియల్ వ్యూ కలెక్టర్ చూశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎక్కువగా మనకు ప్రకృతి పరంగా అందమైన గుట్టలు, చెరువు, గుట్టల నుండి జాలూవారే నీళ్లతో అడవిని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసుకోవాలని, దీనివల్ల ఆర్యోగమనే సంపద వస్తుందని అన్నారు. రానున్న తరాలకు పర్యాటక ప్రాంతంగా తీసుకొని వచ్చి ప్రకృతిని కాపాడుతూ, అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ప్రకృతిని కాపాడుకోలేక మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, దానిని నివారించేందుకు అభివృద్ధి చేపట్టామన్నారు. పులిగుండల ప్రాజెక్టులో ఆహాద్లం పంచే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసి సందర్శకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. పర్యాటకుల కోసం చెరువులో బోటింగ్, వసతి కాటెజ్ లు, భోజనం, త్రాగునీరు వసతులను కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబం, పిల్లలతో సందర్శించి ఆనందంగా గడిపేలా కార్యక్రమం తయారు చేస్తామని అన్నారు. చెరువులో సంచరించే పక్షులు, పులిగుండల చరిత్ర చెప్పే విధంగా వినూత్న కార్యక్రమాల నిర్వహణకు గైడ్ లు కూడా అందుబాటులో ఉంటారని అన్నారు. పిల్లలకు సైక్లింగ్, ఓపెన్ జిమ్, అడ్వెంచర్ యాక్టివిటీస్ వంటివి అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, అటవీ అభివృద్ధి అధికారి మంజుల, అటవీ రేంజ్ అధికారి జి. నాగేశ్వరరావు, అటవీశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : కనువిందు చేయనున్న సరికొత్త పర్యాటక కేంద్రం)