UA-35385725-1 UA-35385725-1

హామీలిచ్చి మోసగించిన.. కూటమి నేతలపై 420 కేసులు పెట్టాలి

హామీలిచ్చి మోసగించిన.. కూటమి నేతలపై 420 కేసులు పెట్టాలి

చంద్రబాబు సంపద సృష్టి ఇదేనా?

తల్లికి వందనం పేరుతో దగా

మహిళలకు ఉచిత బస్సు వాయిదాల పర్వం

 వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఫైర్‌

న్యూస్‌ తెలుగు/అమరావతి: ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన కూటమి నేతలపై 420 కేసులు పెట్టాలని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల డిమాండ్‌ చేశారు. హామీల అమలులో విఫలమైన చంద్రబాబు రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. తాడేపల్లి వైఎస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వ నయవంచనను భరించే స్థితిలో మహిళలు లేరని అన్నారు. ఎన్నికల సమయంలో అధికారమే పరమావధిగా చంద్రబాబు అమలు చేయలేని హామీలతో ప్రజలను నమ్మించాడని, రాజకీయాలలో శుష్కవాగ్ధానాలు చేయకూడదు అనే విషయాన్ని ఏనాడు చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. అక్కచెల్లెమ్మలను మళ్లీ మళ్ళీ నమ్మించి మోసం చేస్తున్నాడని, ఆయన చేసిన హామీలు నిలబెట్టుకోలేకపోగా జగన్‌ గారు ఇస్తున్న పథకాలను నిలిపివేసి మహిళలకు తీవ్ర ద్రోహం చేశాడని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ పేరుతో పెద్ద ఎత్తున బ్రాండిరగ్‌ చేసుకున్నారని, పవన్‌ కళ్యాణ్‌తో సహా కూటమి నేతలు ఈ హామీలను ఒక పేపర్‌ లో రాసి, సంతకాలు చేసి మరీ ప్రజలకు వాగ్ధానం చేశారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత వీటి ఊసే లేదని, ఆరోజు మీరు పెట్టిన సంతకాల విలువ ఇదేనా? అని ప్రశ్నించారు. ఏపీలోని మహిళల పక్షాన ఎక్స్‌ వేదికగా చంద్రబాబును నిలదీశారని, కూటమి ప్రభుత్వం ఎందుకు పదేపదే మహిళలను మాయమాటలతో నమ్మించి మోసం చేస్తోంది? ఇది అన్యాయం కాదా?, కూటమి నేతలు చేస్తున్న మోసాలకు మీపైన 420 కేసు పెట్టవచ్చు అని తెలిపారు. కూటమి నాయకులకు ఇటువంటి మోసాలు కొత్తకాదని, 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలకు ఆశ కల్పించి, అధికారంలోకి వచ్చిన తరువాత యథావిధిగా ఎగ్గొట్టారని వివరించారు. ఆనాడు వారు ఇచ్చిన హామీల పత్రంలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నరేంద్రమోదీ ఫోటోలు కూడా ఉన్నాయని, అమాయక మహిళలకు ఏం చెప్పినా నమ్ముతారు, తేలికగా మోసం చేయవచ్చు అని అనుకుంటున్నారని, మహిళలు ఈ రోజు మీ మాటలపై అమలు ఏదీ అని నిలదీసేందుకు సిద్దంగా ఉన్నారని, మిమ్మల్ని గద్దె దించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు.
తల్లికి వందనం పేరుతో మహిళలను దగా చేశారని, ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారన్నారు. గతంలో జగన్‌ అమ్మ ఒడి పేరుతో ఇస్తున్న దానిని కూడా నిలిపివేశారని, మీరు ఇవ్వాల్సిన తల్లికి వందనంను ఎగ్గొట్టారని, మీ పైన నమ్మకం ఉంచిన తల్లులకు ఈ రోజు ఏం చెబుతారు?, సూళ్లకు వెడుతున్న విద్యార్థుల భవిష్యత్తుకు మీరేం దారి చూపిస్తారు?, జగన్‌ అధికారంలో ఉండి ఉంటే ఇలా జరిగేదా అని తల్లులు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికీ వెళ్లి నీకు పదిహేను… నీకు పదిహేను అంటూ స్కూలుకు వెళ్లే పిల్లలను చూపి, వారి తల్లులను మాయ చేశారన్నారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న రామానాయుడు ఆనాడు తల్లికి వందనం మీద ఎలా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ చూశారని, ప్రతి గ్రామానికి వెళ్లి ఏ విధంగా ప్రచారం చేశారో, ఆ దృశ్యాలు నేటికీ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయని తెలిపారు. మీకు ఆ డబ్బులు వస్తాయంటూ బాండ్‌ కూడా రాసి ఇచ్చామంటూ ఆయన భారీగా ప్రచారం చేసుకున్నారని, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పేదలు దీనిపై నోరు మెదపడటం లేదన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది విద్యార్ధులకు మేలు చేసేలా రూ. 26,067 కోట్లు అయిదేళ్ళలో అందించగా, వాటిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని నిలిపివేశారన్నారు.
ఎన్నికల సమయంలో ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలన్నదే కూటమి నేతల లక్ష్యం అని, ఏరు దాటిన తరువాత తెప్ప తగలేశారు అనే సామెతను నిజం చేస్తూ నేడు కూటమి నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి పేరుతో 19-59 ఏళ్ళ వయస్సు ఉన్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్నారని, ఇందుకు అర్హులైన వారు రాష్ట్రంలో 2.7 కోట్ల మంది ఉన్నారు. వీరికి మీరు ఇస్తానన్న లెక్క ప్రకారం మొత్తం రూ.37,313 కోట్లు, తల్లికి వందనం కింద 83 లక్షల మంది విద్యార్ధులకు గానూ ఏడాదికి మొత్తం రూ.12,450 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. మూడు సిలెండర్ల దీపం పథకం కింద మొత్తం ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వారు..రాష్ట్రంలో 1,54,47,061 మంది ఉన్నారు. మీరు ఇస్తానన్న మూడు సిలెండర్లకు గానూ ఏడాదికి రూ.4,115 కోట్లు అవసరం అవుతాయని, మీ బడ్జెట్‌ లో ప్రకటించింది సుమారు రూ.800 కోట్లు అంటే, అంటే మీరు కేవలం ఒక్క సిలెండర్‌ మాత్రమే ఇవ్వాలనే నిర్ణయంతో ఉన్నారని అర్థం చేసుకోవాలా? అని ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఊదరగొట్టారని, దసరా, దీపావళి, క్రిస్మస్‌, కొత్త సంవత్సరం అని, ఇప్పుడు ఏప్రిల్‌ నెల నుంచి అంటున్నారని, బస్సు ప్రయాణం అమలులో ఇన్ని వాయిదాలు ఎందుకు? అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని ఈ ఆరు నెలల్లో నెరవేర్చలేదని, ఆనాడు నారా లోకేష్‌ మాట్లాడుతూ 2025 జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్‌ చేస్తున్నామని, డేట్‌, టైం రాసిపెట్టుకోండి అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేశారని గుర్తుచేశారు. మహిళా సంక్షేమం గురించి ఎన్ని మాటలు చెప్పారో మరిచిపోయారన్నారు. చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి అంటే రాష్ట్ర ప్రజలకు అని అనుకున్నామనీ.. తమకే ఆ సంపద అని తెలియదని చెప్పారు. దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా గుర్తింపు పొందిన చంద్రబాబును ఈ సందర్భంగా అభినందిస్తున్నామన్నారు. (Story : హామీలిచ్చి మోసగించిన.. కూటమి నేతలపై 420 కేసులు పెట్టాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1