ప్రేమ, శాంతి, సమభావనలకు ప్రతీక క్రిస్మస్ పర్వదినం
వినుకొండ, రాష్ట్ర ప్రజలందరికీ చీఫ్ విప్ జీవీ క్రిస్మస్ శుభాకాంక్షలు
న్యూస్ తెలుగు / వినుకొండ : సమాజంలో ప్రతిఒక్కరు కూడా ప్రేమ, శాంతి, సమభావనలను నింపుకోవాలని, క్రిస్మస్ పర్వది నం సందేశం కూడా అదే అని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. క్రిస్మస్ సందర్భంగా వినుకొండ, రాష్ట్ర ప్రజలందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపిన ఆయన భవిష్యత్పై ఆశలతో, కొత్త సంకల్పాలతో కూడా రానున్న కొత్త ఏడాదిని స్వాగతించాలని కోరారు. మంగళవారం ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. రాష్ట్ర ప్రజలంతా మనమంతా ఒక కుటుంబం అనే భావనతో శాంతి, సామరస్యాలతో కలసి ఉండి, ఒకరికొకరు సహాయ పడుతూ కలసి పురోగమించాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ అనేది ఇతరులకు సహాయం చేయడానికి ఆ భగవంతుడు ఇచ్చిన ఒక మంచి అవకాశం అని కూడా గుర్తు పెట్టుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంగా పెట్టుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్ స్వప్నం నెరవేరాలంటే ఆర్థికంగా కలిమి, మానసికంగా ఆనందం, శారీరకంగా ఆరోగ్యం, అన్నీ మెండుగా ఉండాలని, ప్రజలందరికీ వాటిని ప్రసాదించమని ఈ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏసుని వేడుకుంటానని అన్నారు. సంఘంగా కలసి ముందుకు సాగడంలో ఉన్న కలిమి, బలిమిని అర్థం చేసుకోవాలని, ప్రతికూల ఆలోచనలు, ప్రతికూల శక్తుల వైపు ఎవరు ఆలోచించవద్దని విజ్ఞప్తి చేశారు. (Story : ప్రేమ, శాంతి, సమభావనలకు ప్రతీక క్రిస్మస్ పర్వదినం)