ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు
న్యూస్తెలుగు/ వనపర్తి : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ప్రజలు మెచ్చే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. సోమవారం ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచన మేరకు జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ 2కే రన్ కార్యక్రమానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్ష్ సురభి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన 2కే రన్ ఆర్డీవో ఆఫీస్ వరకు చేరుకొని, తిరిగి బాలుర కళాశాల మైదాననికి చేరుకొని ముగింపు జరిగింది. 2కే రన్లో విద్యార్థులు, యువకులు, పోలీసులు, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొని ఉత్సాహంగా పరుగు తీశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు చూరగొంటుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా డిసెంబర్ 9వ తేదీ వరకు రోజూ వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అందులో భాగంగానే నేడు 2కే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ 2కే రన్ లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డివైస్ ఓ సుధీర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, ఎమ్మార్వో రమేష్ రెడ్డి, ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు)