రూ.235.72 కోట్లు బాధితుల ఖాతాల్లో జమ
జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ డా.నిధిమీనా
న్యూస్ తెలుగు/విజయవాడ : ఇటీవల వరద ముంపుతో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని, ఇప్పటి వరకు 1 లక్ష 44 వేల 672 మంది బాధితుల ఖాతాల్లో రూ.235 కోట్ల 72 లక్షల నగదు జమచేయడం జరిగిందని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డా.నిధి మీనా తెలిపారు. పెండిరగ్లో ఉన్న 2,478 ధరఖాస్తులను పరిశీలించి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసకుంటున్నామని, బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అధిక వర్షాలు, బుడమేరు వరద ప్రభావంతో నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లింపుపై స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మంగళవారం విలేఖర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో సెప్టెంబర్ నెలలో సంభవించిన అధిక వర్షాలు, బుడమేరు వరద ముందపుతో జరిగిన నష్టంలో భాగంగా హౌసింగ్, ఎయ్ఎస్ఎంఇ, వాహనాలు తదితర విభాగాలకు సంబంధించి బాధితులకు పరిహారం చెల్లించటం జరిగిందన్నారు. 179 గ్రామ వార్డు సచివాలయాల్లో వరద గణన జాబితాల ప్రచురణతో పాటు అదనంగా వచ్చిన ధరఖాస్తులను పీజీఆర్ఎస్ ఫ్లడ్ మాడ్యూల్లో నమోదు చేయడం జరిగిందన్నారు. ఆధార్తో బ్యాంకు ఖాతా అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాలకు నేరుగా పరిహారం జమ చేయడం జరిగిందన్నారు. బ్యాంకు ఖాతాలు అనుసంధానం కాని 476 ఖాతాలను అనుసంధానం చేసి చెల్లింపులకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇంకా పరిష్కరించాల్సిన 2,478 ధరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఈ నెల 24వ తేదీలోగా ధరఖాస్తులను పరిష్కరించి అర్హలైన బాధితుల ఖాతాల్లో నష్ట పరిహారం చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు. నష్టపోయిన ప్రతి బాధితునికి పరిహారం చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హలైన ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం తప్పనిసరిగా అందుతుందన్నారు. ఏ ఒక్క బాధిత కుటుంబానికి పరిహారం అందకుండా మిగిలిపోకూడదనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విలేఖర్లు సమావేశంలో జిల్లా రెవిన్యూ ఆఫీసర్ వీ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. (Story : రూ.235.72 కోట్లు బాధితుల ఖాతాల్లో జమ)