Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

0

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

– వేడుకగా రథోత్సవం

– భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు

న్యూస్ తెలుగు /తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం 7 గంటలకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీథులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.

తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైనది. ”రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే” అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.

రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీథులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో – స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం.

వాహనసేవలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు శ్రీమ‌తి గౌతమి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. (Story : భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు)

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version