సి.యం.ఆర్. బియ్యం సేకరణ వేగవంతం చేయాలి
న్యూస్తెలుగు/వనపర్తి : సి.యం.ఆర్. బియ్యం సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ ఛాంబర్ లో పౌర సరఫరాల శాఖ అధికారులతో సి.యం.ఆర్. రైస్ సేకరణ పై సమీక్ష నిర్వహించారు. గత సమీక్ష సమావేశంలో మిల్లర్ల నుండి రోజువారీగా సేకరించాల్సిన బియ్యం సేకరించేకపోవడం పై కలక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బియ్యం ఇవ్వని రైస్ మిల్లులలో తనిఖీ చేయాలని ఖరీఫ్ సీజన్ లో ఇచ్చిన వడ్లు వాస్తవంగా ఉన్నాయా లేవా? అనేది తనిఖీ చేసి సరిగ్గా నిల్వలు లేకుంటే కేసులు బుక్ చేయాలని ఆదేశించారు. రైస్ మిల్లుల తనిఖీ రెండు రోజుల్లో పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని, రైస్ మిల్లర్ల నుండి రైస్ ఇప్పించే బాధ్యత డిప్యూటీ తహసీల్దార్లు తీసుకోవాలని ఆదేశించారు. కాలయాపన చేసిన నిర్లక్ష్యం చేసిన చర్యలు తప్పవని సివిల్ సప్లై డి.టి.లను హెచ్చరించారు.
అక్టోబర్ 5న వరి కొనుగోలు పై జిల్లా స్థాయి సమావేశానికి ఏర్పాట్లు చేయాలి
వరి కొనుగోలు పై కొనుగోలు కేంద్రాల ఇన్చార్జి లకు, లారి ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లకు, వ్యవసాయ విస్తీర్ణాధికారులకు అక్టోబర్ 5 వ తేదీన జిల్లా స్థాయి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందని అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పి.ఏ.సి.ఎస్, ఐ.కే.పి., మెప్మా, ట్రాన్స్పోర్ట్ తదితర సంబంధిన వారు ఎవరెవరిని, ఎంతమందిని పిలవాలో ప్రణాలిక చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా వరి దొడ్డు రకమా లేదా సన్న రకామా అనేది సాంకేతికంగా తెలుసుకోడానికి కొత్తగా డైల్ మైక్రో యంత్రాన్ని ప్రతి పి. ఏ.సి.ఎస్ కు ఒకటి చొప్పున కొని వాడకం పై శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. ఈసారి సన్న రకం వడ్లకు ప్రభుత్వం తరఫున క్వింటాలుకు రూ.500 చొప్పున ప్రోత్సాహకం ఇస్తున్నందున గతంలో కంటే రెండు మూడింతలు అధిక వడ్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున దాదాపు 300 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన మేరకు గన్ని బ్యాగులు, తమ కొలిచే యంత్రాలు, తూకం వేసే యంత్రాలు, తాలు వేరు చేసేందుకు ఫ్యాన్ లు సమకూర్చుకోవాలని సూచించారు.
అదనపు కలక్టర్ రెవెన్యూ యం నగేష్, జిల్లా సివిల్ సప్లయి అధికారి కాశి విశ్వనాథ్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, జిల్లా మార్కెటింగ్ అధికారి స్వరన్ సింగ్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి ప్రసాద్ రావు, జిల్లా తూనికలు కొలతల అధికారి డి. సత్యనారాయణ, డి.పి.యం. అరుణ, డి.యం. ఇర్ఫాన్, సివిల్ సప్లై డి.టి లు తదితరులు పాల్గొన్నారు. (Story : సి.యం.ఆర్. బియ్యం సేకరణ వేగవంతం చేయాలి)