Home టాప్‌స్టోరీ ధరణి ఆపరేటర్లు … వేతనాలందక అవస్థలు

ధరణి ఆపరేటర్లు … వేతనాలందక అవస్థలు

0

ధరణి ఆపరేటర్లు .. వేతనాలందక అవస్థలు

– పట్టించుకోని ప్రభుత్వం..

– రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 713 మంది సిబ్బంది

– పట్టించుకోని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ

– బిల్లులు ఇవ్వకుండా 7 నెలల జీతం ఆపిన ప్రభుత్వం

తాడూరి సతీష్ రెడ్డి ధరణి ఆపరేటర్, అక్కన్నపేట మండలం, సిద్దిపేట జిల్లా

న్యూస్ తెలుగు/సిద్ధిపేట జిల్లా ప్రతినిధి(నారదాసు ఈశ్వర్) : రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 713 మంది ‘ధరణి’ పోర్టల్ ఆపరేటర్లకు 7 నెలలుగా జీతాలు పడలేదు. దీంతో ఆపరేటర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని, అప్పులు పెరిగిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కార్మిక శాఖ నిబంధనల ప్రకారం తమకు కనీసం వేతనంతోపాటు పీఎఫ్/ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, తమని పట్టించుకోని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కుటుంబ పోషణ భారమై..
– రాష్ట్రంలోని భూరికార్డుల ప్రక్షాళన కోసం 2018, మే నెలలో అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్లను నియమించింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఈ సెంట్రిక్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రిక్రూట్​చేసుకుంది. తహసీల్దార్ ఆఫీసుతోపాటు జిల్లా కలెక్టరేట్లు, సీసీఎల్ఏలోని ధరణి హెల్ప్ డెస్కుల్లో వారిని నియమించింది. అలా రాష్ట్ర వ్యాప్తంగా 713 మంది ఆపరేటర్లు పని చేస్తుండగా సిద్ధిపేట జిల్లాలో 28 మంది పనిచేస్తున్నారు.ప్రస్తుతం వీళ్లందరికీ పారాడిగ్మ్ ఐటీ సొల్యూషన్స్ ద్వారా జీతాలు అందుతున్నాయి. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో డేటా ఎంట్రీ చేసిన వీరే.. ధరణి పోర్టల్ రెడీ అయినప్పటి నుంచి రిజిస్ట్రేషన్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలుత వీరికి రూ.రూ.9,875 జీతం ఇవ్వగా, ప్రస్తుతం రూ.11,070 ఇస్తున్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఏనాడు నెలనెలా జీతం తీసుకున్నది లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 7 నెలల జీతం పెండింగ్ పెట్టారని, తమ ఇబ్బందులను కొత్త ప్రభుత్వమైనా పట్టించుకోవాలని ఆపరేటర్లు కోరుతున్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి

ప్రభుత్వ విభాగాల్లో సిబ్బందిని నియమించిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు వారికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. కానీ ధరణి ఆపరేటర్లకు ఆ సౌకర్యాలు లేవు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే తమ జేబులో నుంచే ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. లేబర్ లా ప్రకారం తమకు పీఎఫ్, ఈఎస్ఐ వర్తింపజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆపరేటర్లు కోరుతున్నారు.

ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లించాలి

మాకు జీతాలు రాక 10 నెలలవుతోంది. మా కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కొత్త ప్రభుత్వమైనా పెండింగ్ జీతాలు ఇవ్వాలి.
సీఎం రేవంత్ స్పందించి ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగుల్లాగే మాకు కూడా ప్రతి నెలా 5వ తారీఖులోపు జీతాలివ్వాలి. ధరణి కంప్యూటర్ ఆపరేటర్లలో మహిళలు కూడా ఉన్నారు. వారికి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. (Story ; ధరణి ఆపరేటర్లు … వేతనాలందక అవస్థలు)

(తాడూరి సతీష్ రెడ్డి)
ధరణి ఆపరేటర్, అక్కన్నపేట . సిద్ధిపేట జిల్లా

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version