వసతి గృహ విద్యార్థులకు మెరుగైన విద్యనందించండి
ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కుష్షుబు గుప్తా
న్యూస్తెలుగు/కొమరం భీమ్/ ఆసిఫా జిల్లా : ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటిడిఎ పిఓ కుష్షుబు గుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు.మంగళవారం ఉదయం ఎడ్లబండి పై వాగులు దాటుకుంటూ వెల్గి గ్రామం వాంకిడి మండలంలోని ఆశ్రమ పాఠశాలను పిఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు . విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకునిఉపాధ్యాయుల అటెండెన్స్ మరియు స్టాక్ రిజిస్టార్లను పరిశీలించారు.ఈ సందర్బంగా పిఓ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలన్నారు . సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలనీ అన్నారు. నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతిరోజు వంటగది, స్టోర్ రూమ్, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు భోదించారు. సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఔషధాల రిజిస్టార్ పరిశీలించి ఔషధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.. ఏమైనా మరమ్మతులు ఉంటే తమకి తెలియజేయాలనీ అన్నారు.రోడ్డు మరియు వంతెన వెంటనే ప్రారంభించాలని డిప్యుటీ ఇంజనీర్ అధికారికి ఆదేశించారు. పాఠశాల కు జిసిసి నుండి పాలు,రాగిమల్ట్,గుడ్లు, అరటిపండ్లు గత కొన్నిరోజులుగా సప్లై చేయనందుకు జీసీసీ మేనేజర్ బోజ్య నాయక్ గారికి షో కాస్ నోటీస్ జారీ చేశారు.24 గంటల సమయంలో సమాధానం ఇవ్వకుంటే తదుపరి చర్యలు తీసుకోబడతాయి అని తెలిపారు.
వర్షాల నేపథ్యంలో దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా, వసతి గృహ పరిసరాలలో వర్షపు నీరు నిలువకుండా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.