మీలాదుల్ నబి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జీ.వీ
న్యూస్తెలుగు/వినుకొండ : స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం మీలాదుల్ నబి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా మక్కెన మాట్లాడుతూ మానవులంతా ఒకటేనని ప్రతి ఒక్కరూ పరస్పరం ప్రేమ భావం, శాంతి భావన కలిగి ఉండాలని ప్రవక్త మహమ్మద్ బోధించారని అన్నారు. హింసకు వ్యతిరేకంగా, శాంతిని బోధిస్తూ ప్రవక్త రాళ్ల దెబ్బలు భరించారని చెప్పారు. స్త్రీలను గౌరవించాలని స్త్రీల హక్కుల కోసం అందరూ పాటుపడాలని ప్రవక్త బోధించారని చెబుతూ వ్యభిచారం, మద్యపానం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. పేద ధనిక వ్యత్యాసాలు కుల,మత వ్యత్యాసాలు వీడి మానవులు సోదరుల వలే కలిసిమెలగాలన్న ప్రవక్త బోధ సర్వమానవాళికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పఠాన్ షమీంఖాన్ తెలుగుదేశం పార్టీ నాయకులు సౌడగర్ జానీ భాష, షేక్ ఖాసిం,దస్తగిరి, చికెన్ బాబు, తదితరులు పాల్గొన్నారు. (Story : మీలాదుల్ నబి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జీ.వీ )