ఆక్రమణలు తొలగించి నిరుపేదలకు న్యాయం చేయండి
– నిరుపేదలకు ఇల్లు ఇవ్వండి
– శ్మశాన భూమి కేటాయించండి
– కలెక్టర్ కు చేనేతపురి, దత్తక్షేత్రం కాలనీ వాసుల ఫిర్యాదు
– అవినీతి రెవెన్యూ అధికారులపై చర్యలకు ఆదేశం
న్యూస్ తెలుగు/బాపట్ల: చేనేతపురి కాలనీ, దత్తక్షేత్రం కాలనీ, జగనన్న కాలనీలలో జరిగిన భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలపై విచారణకు స్థానిక రెవెన్యూ, సచివాలయ సిబ్బందిని దూరంగా ఉంచి, సమగ్ర విచారణ జరిపి, యావత్తు ఖాళీ స్థలములు, రోడ్ మార్జిన్స్ గుర్తించి, ఆక్రమణలను తొలగించి సామాజిక అవసరాలకు కేటాయించమని, ఆక్రమణలకు, భూకబ్జాలకు పాల్పడిన వారిని, వారికి సహకరించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.
వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయితీ చేనేతపురి, దత్తక్షేత్రం, జగనన్న కాలనీలలో నిరుపయోగంగా ఉన్న ఇంటి స్థలాలు, గృహాలను సర్వే చేసి చట్టబద్దంగా లేనివారికి నోటీసులు జారీ చేసి, సదరు ఇంటి స్థలాలు, గృహములను తిరిగి స్వాధీనం చేసుకుని అర్హులైనవారికి కేటాయించాలని కలెక్టర్ ను కోరారు. కాలనీల్లో జరుగుతున్న అవితీతి అక్రమాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఈరోజుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అవినీతి రెవెన్యూ అధికారుల కారణంగా స్థానికులు కొందరు ఇండ్ల స్థలాలను, గృహాలను కొనుగోలు చేయడం అమ్ముకోవడం చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు సొంతంగా ప్లాట్స్ లో తాత్కాలిక బేస్ మెంట్స్ నిర్మాణం చేసి వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. రెండు వేలమంది నివాస యోగ్యమైన ఈ మూడు కాలనీలకు స్మశానం లేదని, వెంటనే భూమి కేటాయించాలని కలెక్టర్ ను కాలనీ వాసులు కోరగా, స్పందించిన కలెక్టర్ చీరాల ఆర్ డి ఓ తో చరవణిలో మాట్లాడి, తక్షణమే అవినీతి అధికారులపై రిపోర్ట్ చేసి చర్యలు తీసుకోవాలని, కాలనీల్లో ఉన్న ఆక్రమణలను తొలగించి , అనర్హులకు నోటీసులు జారీచేసి,స్వాధీనం చేసుకుని అర్హులైన నిరుపేదలకు గృహాలు, నివేశనా స్థలాలు ఇవ్వాలని ఆదేశించగా, అందుకోసం కాలనీల్లో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసి మొత్తం లబ్దిదారులను ఫీల్డ్ లో తనిఖీలు నిర్వహించి తగు చర్యలు చేపడతామని ఆర్ డి ఓ తెలిపాని కాలనీ వాసులు తెలిపారు. కలెక్టర్, ఆర్ డి ఓ లను కలిసినవారిలో అనుభం వెంకటేశ్వర్లు, మచ్చా శేఖర్, ధనుంజయ్ లు ఉన్నారు. (Story: ఆక్రమణలు తొలగించి నిరుపేదలకు న్యాయం చేయండి)