వినుకొండలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత మార్కెట్ వద్ద గల శ్రీరాములు విగ్రహానికి వాసవి క్లబ్ అధ్యక్షులు కాసుల వెంకట రవీంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాములు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం 6.8 ఎకరాల్లో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని (త్యాగ శిల్పం), స్మృతివనాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సీఎంకు, మెమోరియల్ ట్రస్ట్కు ధన్యవాదాలు తెలిపారు.ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన ఆయన ‘భాషాప్రయుక్త రాష్ట్రాల పితామహుడు’ అని కొనియాడారు. అమరావతిలోని విగ్రహం కేవలం నిర్మాణం కాదని, అది తెలుగు వారి ఆత్మగౌరవానికి, త్యాగానికి ప్రతీక అన్నారు. ఆయన ఆశయాలను గౌరవిస్తూ, తెలుగు భాషను కాపాడుకోవడమే మనం ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సెక్రటరీ టంగుటూరి వీరబ్రహ్మం, ట్రెజరర్ గర్రె నరసింహారావు, యూత్ క్లబ్ ప్రెసిడెంట్ గుర్రం బాల సాయి కుమార్, ఆర్యవైశ్య సదావర్తి సంఘం గౌరవ అధ్యక్షులు తాతా సత్యనారాయణ, దేవస్థానాల చైర్మన్లు అచ్యుత కోటేశ్వరరావు, చిలంకూరి కోటేశ్వరరావు తదితర వాసవి, వనితా క్లబ్ సభ్యులు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.(Story : వినుకొండలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు)

