వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసిన వినుకొండ పోలీసులు
న్యూస్ తెలుగు /వినుకొండ : వినాయక నిమజ్జనాలలో టిడిపి నాయకుల అరాచకాలు సాగిస్తూ వైసిపి నేతలను అక్రమ అరెస్టులు చేయడంపై ప్రముఖ న్యాయవాది, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం. ఎన్. ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. వినాయక చవితిని పురస్కరించుకుని వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం మండలంలోని కారుమంచి గ్రామంలో వినాయక నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం రాత్రి నిమర్జనం సందర్భంగా గ్రామంలో టిడిపి నేతలు వైసిపి శ్రేణుల ఇళ్లమీదకు వెళ్లి రాళ్లతో, కర్రలతో దాడి చేశారని, ఈ దాడి మొత్తాన్ని గమనించిన వీడియోలు చిత్రీకరించిన పోలీసులు వాటిని ప్రదర్శించకుండా ఏకపక్షంగా దాడుల్లో గాయపడ్డ వైసిపి నేతల్ని అరెస్టు చేయడం అరాచక పాలనకు నిదర్శనం అని ప్రముఖ న్యాయవాది, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం. ఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. శావల్యాపురం మండలంలోని కారుమంచి గ్రామానికి చెందిన మాజీ సొసైటీ అధ్యక్షుడు బొల్లా శివను మరియు గ్రామానికి చెందిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దాదాపు పది మందిని శుక్రవారం తెల్లవారు జామున 3:30 ని:లకు అక్రమ అరెస్టు చేసి ఏ పోలీసు స్టేషన్లో ఉన్నారో కూడా కుటుంబ సభ్యులకు పోలీస్ వారు తెలపలేదు. అక్రమంగా పోలీసులు అరెస్ట్ చెయ్యటం దారుణమని, పోలీసులు కూటమి నాయకుల మెప్పుకోసం ఇలాంటి అక్రమ అరెస్టులు చెయ్యటం సరికాదని, అరెస్ట్ అయిన వైసీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని, దాడులకు కారకులైన టిడిపి నేతలను వెంటనే శిక్షించాలని, వాస్తవాలను చిత్రీకరించిన వీడియోలను పోలీసులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన ఆందోళనకు దిగుతామని, అవసరమైతే న్యాయస్థానంలో తేల్చుకుంటామని ఎం. ఎన్. ప్రసాద్ హెచ్చరించారు. వినుకొండ నియోజకవర్గంలో ప్రతిచోట టిడిపి అరాచక పాలన కొనసాగిస్తుందని, త్వరలోనే ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున ఆయన భరోసా కల్పించారు. అలాగే బాధిత కుటుంబాల మహిళలు తమవారిని విడిచి పెట్టాలని శుక్రవారం నాడు వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. (Story:వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసిన వినుకొండ పోలీసులు)

