విస్తృత ఉద్యోగ అవకాశాల్ని యువత అందిపుచ్చుకోవాలి
వినుకొండలో నైపుణ్యాభివృద్ధి సంస్థ మెగా ఉద్యోగ మేళాకు విశేష స్పందన
న్యూస్ తెలుగు/ వినుకొండ : ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటురంగంలోకి లభిస్తోన్న విస్తృత ఉద్యోగ అవకాశాల్ని యువత అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ చీఫ్విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలపునిచ్చారు. కేవలం రూ.1200 జీతంతో సేల్స్ రిప్రజెంటేటివ్గా ప్రారంభించి ఎదిగిన తన జీవిత ప్రస్థానమే అందుకు నిదర్శనమన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్మేళాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ జాబ్ మేళాకు 28 కంపెనీలు, 1666 మంది యువత హాజరు కాగా అందులో 521 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన చీఫ్విప్ జీవీ ఇష్టంతో ఎంచుకున్న ఉద్యోగాల్లో కష్టపడి పనిచేస్తే సాఫ్ట్వేర్ను మించిన జీతాలు కూడా సాధించే అవకాశాలు ఉంటాయన్నారు. తమ కంపెనీల్లోనే మార్కెటింగ్ విభాగంలో నెలకు రూ. లక్ష నుంచి రూ. 3లక్షల వరకు జీతాలు తీసుకుం టున్న ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. మార్కెటింగ్ రంగంలో విస్తృత అవకాశాలు ఉంటాయని, నేడు ప్రపంచంలో కంపెనీలకు సీఈవోలుగా ఉన్నవారిలో 65% ఈ విభాగం నుంచే వచ్చారన్నా రు. తాను కూడా అలానే అంచెలంచెలుగా ఎదిగి శివశక్తి బయోను స్థాపించి, 15 రాష్ట్రాల్లో 5వేల మంది ఉద్యోగులతో వ్యాపారంలో ముందుకువెళ్తున్నా అన్నారు. ప్రస్తుతం తమ కంపెనీ రూ.1000కోట్ల టర్నోవర్కు చేరిందని, మూడేళ్లలో రూ. 2వేల కోట్లు, ఏడేళ్లలో 5వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తమ అనుబంధ సంస్థలైన పుష్కళ్ అగ్రి టెక్, షణ్ముక్ అగ్రిటెక్లు కూడా వినుకొండ జాబ్ మేళాలలో పాల్గొన్నట్లు తెలిపారు. కష్టపడే వాళ్లు ఎప్పుడూ ముందుకు వెళ్తారని గుర్తు పెట్టుకోవాలని, ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఈ.తమ్మాజి రావు, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అదనపు అధికారి రామాంజనేయులు, జిల్లా ఉద్యోగ కల్పనా అధికారి రవీంద్ర నాయక్, కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. (Story:విస్తృత ఉద్యోగ అవకాశాల్ని యువత అందిపుచ్చుకోవాలి)

