“కేంద్రం–మావోయిస్టులు కాల్పులు విరమణ ప్రకటించాలి”
– ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్
– చీరాల పట్టణంలో ఆదివాసి మహిళల ర్యాలీ
న్యూస్తెలుగు/ చీరాల: కేంద్ర ప్రభుత్వం–మావోయిస్టులు తక్షణమే కాల్పులు విరమణ ప్రకటించి శాంతి చర్చలకు సంకేతాలు ఇవ్వాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. బుధవారం ఉదయం చీరాల పట్టణంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కేంద్రం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన శాంతి ర్యాలీలో ఆదివాసీ మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకులు డాక్టర్ మాచర్ల మోహన్ రావు ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ మధ్య భారత దేశ రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, ఒరిస్సా రాష్ట్రాల్లో విస్తరించిన ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం దారుణమారణకాండను కొనసాగించడం ద్వారా భారత పౌరులను హతమారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ పౌరులు తమ ఓట్ల ద్వారా ఎన్నుకున్న పాలకులు ప్రకృతి వనరులను అటవీ ఖనిజ సంపదలను భవిష్యత్ తరాలకు అందించే విధంగా కార్యాచరణ రూపొందించకపోగా విదేశీ బహుళ జాతి సంస్థలకు దోచిపట్టడంలో భాగంగా ఊడిగం చేస్తూ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని మోహన్ రావు పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అటవీ ఖనిజ సంపదను విదేశీ సంస్థలు కొల్లగొట్టకుండా అడ్డుకుంటున్నటువంటి ఆదివాసీలను వారికి మద్దతుగా నిలిచిన మావోయిస్టులపై సైనిక దాడులు కొనసాగించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన చర్యలుగా దేశ పౌరులు గుర్తించి దేశంలో శాంతి వాతావరణం నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వంపై పౌర సమాజం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఏరుకుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు నల్లబోతుల మోహన్ కుమార్ ధర్మ మాట్లాడుతూ దేశ ప్రజలకు రక్షణ కల్పించి సౌకర్యవంతమైన స్వేచ్ఛ జీవనం అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను ముఖ్యంగా ఆదివాసీలను శత్రువులుగా భావించి సైనిక చర్యలు చేపట్టడం ద్వారా హత్యలు చేస్తోందని ఆరోపించారు.సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు గాదె హరిహరరావు మాట్లాడుతూ భారతదేశం సరిహద్దులలో రక్షణ ఎంత అవసరమో దేశంలో అంతర్గత భద్రత అంతే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం తక్షణమే కాల్పులు విరమణ ప్రకటించి శాంతి చర్చలకు సానుకూల వాతావరణం కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చీరాల అభివృద్ధి సాధన సమితి నాయకులు శీలం రవికుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిని హక్కుల కోసం పోరాడుతున్న వారిని అర్బన్ నక్సలైట్ల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అణిచివేత చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో ఆదివాసీలపై జరుగుతున్న దాడులతోపాటు, క్రిస్టియన్, ముస్లిం మతపరమైన ఆస్తులకు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని హిందూమత ఉన్మాదంతో జరుగుతున్న హత్యాకాండలకు ప్రభుత్వాలు మద్దతు ఇవడం దుర్మార్గమైన చర్యలుగా ఆయన పేర్కొన్నారు.కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు మాట్లాడుతూ ప్రజాస్వామిక వ్యవస్థలో చర్చలు ద్వారా సమస్య పరిష్కరించాలి కానీ ప్రజలపై యుద్ధం చేయడం పరిష్కారం కాదని, దేశంలో ప్రజల మానప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం తక్షణమే కాల్పులు విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసీల పోరాటాలు వర్ధిల్లాలని, కేంద్రం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ తక్షణమే నిలిపివేయాలని, కేంద్రం కాల్పులు విరమణ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చీరాల పట్టణంలో జరిగిన శాంతి ర్యాలీలో ముస్లిం లీగ్ నాయకులు షేక్ బషీర్ అబ్దుల్లా, దేవన వీర నాగేశ్వరరావు, మేడిన వెంకటరెడ్డి, గుంటూరు మల్లికార్జున్, షేక్ జిలానీ, మానికల పో లీస్, ఏలియా, కనకయ్య, పద్మ, సత్యానందం,గోసాల అశోక్ , ఆదివాసీ మహిళలు, సీనియర్ సిటిజన్స్, కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story:”కేంద్రం–మావోయిస్టులు కాల్పులు విరమణ ప్రకటించాలి”)

