పెరుమాళ్ళపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం, లేగ దూడల ప్రదర్శన
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్, పశు సంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పెరుమాళ్ళపల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం, రాష్ట్రీయ గోకుల మిషన్ కింద మేలు జాతి లేగ దూడల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ప్రారంభించగా, న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు పశుసంపద పెంపుపై అధికారులకు సందేశం ద్వారా దిశానిర్దేశం చేశారు. మార్కెట్ యార్డు చైర్మన్ మీసాల మురళి యాదవ్, పశువైద్యాశాల ఏడీ డాక్టర్ ఎన్. శ్రీరాములు మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ వీర్యం లాభాలు, వేసవిలో పశుపోషణ, దూడల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ శిబిరంలో 72 దూడలకు పేడ పరీక్షలు చేసి నులిపురుగుల మందులు, టానిక్ లు పంపిణీ చేశారు. 33 గేదెలకు గర్భకోశ పరీక్షలు, 15 పశువులకు చూడి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డి.సి. ఏడుకొండలు, జి. ఆంజనేయులు, వెంకట్రావు, సీతారామయ్య, పశువైద్యులు డాక్టర్ పి. అమీర్ భాషా, డాక్టర్ డి.వి. శివాజీ, డాక్టర్ మనోజ్, మార్కెట్ యార్డ్ సెక్రటరీ కృష్ణా నాయక్, సిబ్బంది మరియు పశుపోషకులు పాల్గొన్నారు.(Story : పెరుమాళ్ళపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం, లేగ దూడల ప్రదర్శన)

