భక్తులకు ఇబ్బందులు లేకుండా మదమంచిపాడు తిరుణాల ఏర్పాట్లు
న్యూస్ తెలుగు/వినుకొండ : ఏప్రిల్ 6వ తేదీన మదమంచిపాడు గ్రామంలో జరగనున్న శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల ఏర్పాట్లపై అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు ఆదేశాల మేరకు జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అన్ని శాఖల అధికారులతో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించారు. తిరుణాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ పరిసరాలను వారు స్వయంగా పరిశీలించారు. అనంతరం తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, విద్యుత్, లైటింగ్ మరియు భద్రతా ఏర్పాట్లపై అధికారులతో కూలంకషంగా చర్చించారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు న్యూజిలాండ్ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొని అధికారులతో మాట్లాడారు. తిరుణాల ఏర్పాట్లపై వారికి పలు కీలక మార్గదర్శకాలు అందించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మార్వో, పోలీసు సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు మరియు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.(Story : భక్తులకు ఇబ్బందులు లేకుండా మదమంచిపాడు తిరుణాల ఏర్పాట్లు )

