అతిసారా లేదు – ప్రజలు భయపడవద్దు
న్యూస్ తెలుగు/వినుకొండ : నియోజకవర్గంలోని ఈపూరు మండలం పొనుగోటివారిపాలెంలో అతిసార వ్యాధి ప్రబలుతోందన్న వార్తలపై ప్రభుత్వ చీఫ్ విప్ జీ.వి ఆంజనేయులు తక్షణమే స్పందించారు. ప్రస్తుతం న్యూజిలాండ్లో ఉన్న ఆయన, ఘటనపై సమాచారం అందిన వెంటనే అక్కడి నుంచే స్థానిక వైద్యాధికారులు, ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. తక్షణమే గ్రామానికి వైద్య బృందాలను పంపి సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఎటువంటి అతిసార కేసులు నమోదు కాలేదని, కేవలం వాతావరణ మార్పుల వల్ల వచ్చిన సాధారణ విరోచనాలు మాత్రమేనని అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని జీవి భరోసా ఇచ్చారు. తాను దూరంగా ఉన్నప్పటికీ గ్రామ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నానని, వైద్య సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని, పరిశుభ్రమైన ఆహారం తీసుకుంటూ కాచి చల్లార్చిన నీటినే త్రాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.(Story : అతిసారా లేదు – ప్రజలు భయపడవద్దు )

