సెల్లార్లో గ్రంథాలయం పాఠకులకు అవస్థలు
నూతన భవనం ఏర్పాటు చేయాలని అధికారులకు ఏఐవైఎఫ్ వినతి
న్యూస్ తెలుగు/వినుకొండ : పట్టణంలోని కీర్తి థియేటర్ పక్కన సెల్లార్లో నడుస్తున్న శాఖ గ్రంథాలయంతో పాఠకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నూతన భవనం ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. అద్దె భవనంలోని సెల్లార్లో నిర్వహిస్తున్న ఈ గ్రంథాలయానికి కిందికి వెళ్లే మెట్లకు రక్షణ గోడ లేదు. దీంతో విద్యార్థులు, యువకులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు జారిపడి గాయాలపాలవుతున్నారు. వర్షాలు వచ్చినప్పుడు సెల్లార్లోకి ఊట నీరు చేరి పుస్తకాలు తడిసి పాడైపోతున్నాయి. ప్రజల నుంచి ఏటా లక్షలాది రూపాయల గ్రంథాలయ సెస్సు వసూలు చేస్తున్నా, కనీస సౌకర్యాలు కల్పించకపోవడం విచారకరమన్నారు. గత పదేళ్లుగా గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలు కూడా కొనుగోలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. సెస్సు రూపంలో వసూలు చేసిన డబ్బును గ్రంథాలయ అభివృద్ధికే ఉపయోగించాలని, పుస్తక ప్రియులకు అందుబాటులో ఉండేలా సౌకర్యవంతమైన భవనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.కోటేశ్వరరావు, యు.అజయ్ కుమార్, షేక్ కరీం, రవితేజ, కిరణ్ కుమార్, మహేంద్ర సింగ్, హుస్సేన్ బాబు, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.(Story : సెల్లార్లో గ్రంథాలయం పాఠకులకు అవస్థలు )

