కేతేపల్లి లో మంచినీటి సమస్య తీర్చాలని సిపిఐ ధర్నా
న్యూస్ తెలుగు/పానగల్ : పానగల్ మండలం కేతేపల్లి లో మంచినీటి ఎద్దడిని తీర్చాలని, ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని సిపిఐ ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. సిపిఐ నేత మాజీ సర్పంచ్ కళావతమ్మ, ఉప సర్పంచ్ కృష్ణవేణి మాట్లాడుతూ.. కేతేపల్లిలో 5000 కు పైగా జనాభా ఉందని, మిషన్ భగీరథ స్కీము వచ్చిన నాటి నుంచి కూడా ఏ రోజు ప్రజలకు చాలినంత తాగునీరు ఇవ్వలేదన్నారు. సగభాగానికి పైగా ప్రజలు కేతేపల్లి పాత ఊరును వదిలి భగత్ సింగ్ నగర్ ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకున్నారని అక్కడ కేవలం 40,000 లీటర్ల కెపాసిటీ గల ట్యాంకు మాత్రమే నిర్మించారని, గంటసేపు కూడా నీళ్లు రాకపోవడంతో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 40 లీటర్ల కెపాసిటీ గల ఓ ఎస్ హెచ్ ఆర్ వద్దనే 1,20,000 లీటర్ల కెపాసిటీ గల మరో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించి, గతంలో గుండ్ల చెరువులో వేసిన వాటర్ స్కీం, మిషన్ భగీరథ నీటి ద్వారా దాన్ని నింపితే సమస్య తీరుతుందన్నారు. మిషన్ భగీరథ నీటిని పూర్తిస్థాయిలో అందించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగాది రంజాన్ పండుగలు ఉన్నాయని ఉపాధి హామీ కూలి బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ధర్నా అనంతరం వినతి పత్రాన్ని సూపర్డెంట్ కు అందజేశారు. సిపిఐ నేతలు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.(Story : కేతేపల్లి లో మంచినీటి సమస్య తీర్చాలని సిపిఐ ధర్నా )

