హోమ్ కంపోస్టింగ్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం
న్యూస్ తెలుగు/వినుకొండ : స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 లో భాగంగా పట్టణాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు,పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల ఐఏఎస్ ఆదేశాల మేరకు, మున్సిపల్ కమిషనర్ కె. శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో హోమ్ కంపోస్టింగ్ (ఇంటి వద్దే ఎరువు తయారీ) పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం స్థానిక మెప్మా కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ‘హోమ్ కంపోస్ట్’ విధానం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మొత్తం 44 సచివాలయాల ఆర్.పి (రిసోర్స్ పర్సన్)లందరికీ హోమ్ కంపోస్ట్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కిట్లలో కంపోస్ట్ బాక్సులు, మెన్యూర్ (ఎరువు పొడి), మరియు లీచేట్ ద్రవాన్ని సేకరించేందుకు అవసరమైన పరికరాలను అందజేశారు. ఈ ఆర్.పి ల ద్వారా పట్టణంలోని 10,000 మంది స్వయం సహాయక సంఘ మహిళలకు వారి స్వగృహాల వద్దే తడి చెత్తను ఎరువుగా ఎలా మార్చుకోవాలో వివరించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా, ప్రతి ఇంట్లో ఉత్పత్తి అయ్యే తడి చెత్తను బయట పారేయకుండా, ఇంటి వద్దే సేంద్రియ ఎరువుగా మార్చుకోవడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని కమిషనర్ వివరించారు. తద్వారా వినుకొండ పురపాలక సంఘం స్వచ్ఛతలో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ,ఏ. ఐ. ఐ. ఎల్. ఎస్. జి. జిల్లా కో ఆర్డినేటర్ కే. శివ పార్వతి,సచివాలయ సిబ్బంది, ఆర్.పి లు, సీ.వో. లు, మెప్మా సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.(Story : హోమ్ కంపోస్టింగ్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం)

