గృహోపయోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడితే కఠిన చర్యలు
గ్యాస్ ఏజెన్సీల డీలర్లతో వినుకొండ తహసీల్దార్ అత్యవసర సమావేశం
న్యూస్ తెలుగు/వినుకొండ : పట్టణంలోని ఆరు గ్యాస్ ఏజెన్సీల డీలర్లతో తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం తహసీల్దార్ సురేష్ నాయక్ అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్యాస్ సరఫరా, నిబంధనల అమలుపై డీలర్లకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని హాస్టళ్లు, ఆసుపత్రులు, ఐసీడీఎస్ కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని డీలర్లను ఆదేశించారు. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, క్యాటరింగ్ నిర్వాహకులకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే వినియోగదారుల వద్ద అదనంగా డబ్బులు వసూలు చేసినా చర్యలు తప్పవని తహసీల్దార్ స్పష్టం చేశారు. ప్రతి ఏజెన్సీ తమ రోజువారీ గ్యాస్ స్టాక్ వివరాలను (స్టాక్ రిపోర్టు) విధిగా తహసీల్దార్ కార్యాలయానికి సమర్పించాలని ఈ సందర్భంగా ఆయన డీలర్లను ఆదేశించారు. యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయిల్ సరఫరా లో కొంత ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో అలాగే గ్యాస్ కూడా సరఫరా కొంత కష్టతరమవుతున్న నేపథ్యంలో ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి డీలర్లకు పలు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే వినుకొండ లోని అన్ని గ్యాస్ గోడౌన్లను ఆయన పరిశీలించి తనిఖీ చేసి స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. తహసీల్దార్ తోపాటు డిటి మురళీధర్ రావు, ఆర్ఐ శ్రీహరి సిబ్బంది పాల్గొన్నారు.(Story : గృహోపయోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడితే కఠిన చర్యలు )

