రామాయణ కావ్య రసధుని కవయిత్రి మొల్ల: ఏపీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
ఘనంగా మహాకవయిత్రి మొల్లమాంబ 586వ జయంతి వేడుకలు
రాష్ట్ర పండుగగా ప్రకటించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
న్యూస్ తెలుగు/వినుకొండ : పరమ పవిత్రమైన రామాయణాన్ని తెలుగు ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో రచించిన మహాకవయిత్రి మొల్లమాంబ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కొనియాడారు. ఆయన కార్యాలయంలో మొల్లమాంబ 586వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మహిళల చదువుపై చిన్నచూపు ఉన్న 15వ శతాబ్దంలోనే తన జ్ఞానాన్ని రచనల ద్వారా లోకానికి చాటిన గొప్ప ధీరవనిత మొల్ల అని కీర్తించారు. నిరుపేద కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆమె.. తన రచనలతో నాటి సమాజంలోని అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపారని పేర్కొన్నారు. మొల్లమాంబ జయంతిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా గుర్తించడం అత్యంత అభినందనీయమన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీ రామారావు సైతం ఆమె ఖ్యాతిని గుర్తించి హైదరాబాద్ ట్యాంక్ బండ్పై విగ్రహాన్ని ప్రతిష్ఠించారని గుర్తుచేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం మొల్లమాంబ పేరిట పోస్టల్ స్టాంపును విడుదల చేయడంతో పాటు, పాఠశాల పాఠ్యాంశాల్లో ఆమె చరిత్రను చేర్చడం మనందరికీ గర్వకారణమని ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ టీడీపీ అధ్యక్షులు బొంకూరి రోశయ్య, మాతృశ్రీ మొల్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పారెళ్ల మల్లికార్జునరావు, పల్నాడు జిల్లా శాలివాహన సంఘం గౌరవ అధ్యక్షులు పారెళ్ల రమేష్, వినుకొండ కుమ్మర సంఘం అధ్యక్షులు పత్తేపురం గాలయ్య, ఏపీ శాలివాహన కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పిడతల నేమలయ్య, వినుకొండ శాలివాహన సంఘం ప్రధాన కార్యదర్శి పారేళ్ళ సుబ్రహ్మణ్యం, కోశాధికారి సంగెపు వెంకటేశ్వర్లు, పారెళ్ళ లక్ష్మయ్య, జీడిమల్ల మోహన్, పారెళ్ల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.(Story : రామాయణ కావ్య రసధుని కవయిత్రి మొల్ల: ఏపీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు )

