చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
న్యూస్ తెలుగు/ చింతూరు : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం”* నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం తెలియజేశారు. సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులు, సేవలను అందించడంలో వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వినియోగదారులకు గల హక్కులను గూర్చి అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు.వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి జి.హారతి మాట్లాడుతూ వినియోగదారులు మోసాలకు గురైనట్లయితే జిల్లా, రాష్ట్ర, జాతీయ కమీషన్లలో ఫిర్యాదు చేసి నష్టపరిహారాన్ని పొందవచ్చునన్నారు. వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు ఆర్.మౌనిక మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం – 1986 అమలులోనికి తెచ్చినప్పటి నుండి డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. కంప్యూటర్ అధ్యాపకులు ఎన్. ఆనంద్ మాట్లాడుతూ వస్తు,సేవలను కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎస్.అప్పనమ్మ, కె. శైలజ, ఎమ్ నాగ మోహన్,బి. శ్రీనివాసరావు, కె ఎల్. ప్రసన్న కుమారి, ఆర్. కిరణ్మయి,కె. కీర్తి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.(Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం )

