ముండ్లమూరు బస్టాండ్ సెంటర్ లో కాల్వల సమస్య పరిష్కరించాలి
మాల మహానాడు విజ్ఞప్తి
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మాల మహానాడు కమిటీ సభ్యులు బుధవారం నాడు పట్టణ మున్సిపల్ కమిషనర్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ముఖ్యంగా ముండ్లమూరు బస్టాండ్ సెంటర్లో డ్రైనేజీ మరమ్మత్తుల కోసం తవ్వి వదిలివేసిన కాలవలను తక్షణమే పూడ్చివేయాలని నాయకులు కోరారు. తవ్విన కాలవల కారణంగా వ్యాపారస్తులకు, ప్రయాణికులకు మరియు వాహనాలకు ట్రాఫిక్ పరంగా తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, పట్టణంలో ఇంకా కొన్నిచోట్ల తిరుగుతున్న ఆవుల సమస్యను పరిష్కరించాలని కమిటీ కోరింది. డిసెంబర్ 6వ తారీఖున డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల పరిసరాలను శుభ్రపరిచి, అహ్లాదకరంగా ఏర్పాటు చేయాలని మాల మహానాడు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రు విజయ్, వినుకొండ పట్టణ టౌన్ అధ్యక్షుడు రాయని చిన్న, ట్రెజరరీ పి. రమేష్, యేసయ్య పాల్గొన్నారు.(Story:ముండ్లమూరు బస్టాండ్ సెంటర్ లో కాల్వల సమస్య పరిష్కరించాలి)

