పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి
శివశక్తి ఆధ్వర్యంలో కార్మికులకు దుస్తులు పంపిణీ
న్యూస్ తెలుగు / వినుకొండ : పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని ప్రభుత్వ చీఫ్ విప్, సీరియల్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం మంగళవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చేపట్టగా ముఖ్యఅతిథిగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరై కార్మికులకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల శ్రమతోనే పుర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటున్నారని తెలిపారు. కార్మికులు పనిచేయని పక్షంలో పరిసరాలన్ని అపరిశుభ్రంగా మారతాయని, కార్మికుల శ్రమ ఎంతో కష్టతరమైందని అన్నారు. వినుకొండ పట్టణంలో మున్సిపల్ కార్మికులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడం వలన స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర లో వినుకొండ మున్సిపాలిటీ అవార్డు సాధించడం అభినందనీయమన్నారు. పట్టణంలో త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. గత టిడిపి హయాంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు దృష్టికి పట్టణ త్రాగునీటి సమస్యను తీసుకువెళ్లి 160 కోట్లు నిధులు తీసుకువస్తే ఐదేళ్ల వైసిపి పాలనలో పనులు చేపట్టకపోవడంతో పథకం నిలిచిపోయిందన్నారు. కూటమి మొత్తం అధికారంలోకి రాగానే త్రాగునీటి సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి 210 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని, రెండేళ్లలో పనులు పూర్తి చేసి పట్టణానికి శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అలాగే నియోజకవర్గంలోని గ్రామాలలో జలజీవన్ మిషన్ ద్వారా తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. పట్టణ పుర ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, చైర్మన్ దస్తగిరి షకీలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story:పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి)
