వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం.. రోడ్లు అద్వానం..
పట్టణ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి..
న్యూస్ తెలుగు/ వినుకొండ : గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోడ్లు గుంతల మయమై అద్వానంగా మారాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని వినుకొండ- కారంపూడి రాష్ట్ర హైవేపై భారీగా ఏర్పడి వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారిన గుంతల మరమ్మత్తుల పనులను చీఫ్ విప్ జీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో 10 లక్షల కోట్లు అప్పులు చేసి అభివృద్ధిని గాలికి వదిలేసారని విమర్శించారు. ఐదేళ్లగా కొత్త రోడ్లు వేయడం అటు నుంచి పాత రోడ్లకు మరమ్మత్తులను కూడా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. 2015-16 సంవత్సరం టిడిపి పాలనలో ఈ రోడ్డు వేయడం జరిగిందని, ఐదేళ్లు రోడ్డు మరమ్మతులకు నిధులు ఇవ్వకుండా ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్, మునిసిపల్ ఇలా ఏ శాఖకు సంబంధించిన రోడ్లు చూసిన అద్వానంగా తయారయ్యాయని అన్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిలో వాహన రాకపోకలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రోడ్లకు నిధులు కేటాయించడం, మరమ్మత్తులు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగానికి ఆదేశించడం జరిగిందన్నారు. గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కి ప్రజల సహకారం అందించాలని కోరారు. వినుకొండ నుండి కారంపూడి రోడ్డు హైవే వరకు రోడ్డు కలిపేందుకు పనులు జరుగుతున్నాయని, తాత్కాలికంగా వినుకొండ నుండి 18 కిలోమీటర్లు ముంతా తుఫాన్ వల్ల దెబ్బతిన్న రోడ్డు 22 లక్షలతో మరమ్మత్తులు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, టిడిపి నేతలు పెమ్మసాని నాగేశ్వరరావు, టిడిపి పట్టణ అధ్యక్షులు బొంకూరి రోశయ్య, క్లస్టర్ ఇన్ ఛార్జ్ జాని, మున్సిపల్ కౌన్సిలర్, చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీలా, ఆర్.అండ్. బి. ఏ. ఈ. నవ్య, మునిసిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్, మున్సిపల్ ఏ.ఈ.ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.(Story :వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం.. రోడ్లు అద్వానం..)

