వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్వాహకులకు అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ గోపాల్పేట మండల పరిధిలోని తాడిపర్తి, పొలికపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్ని తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు రైతుల ధాన్యం రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని తెచ్చినట్లుగా రిజిస్టర్లలో నమోదు చేయాలని, తేమ శాతాన్ని కూడా ప్రతిరోజు చెక్ చేసి రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ట్యాబ్ ఎంట్రీ లను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వరి కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతులు తెచ్చిన ధాన్యంలో తాలు ఉంటే, క్లీనర్ల ద్వారా తొలగించిన తర్వాతే కొనుగోలు చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లుకు తరలించాలని సూచించారు. ఆలస్యం లేకుండా ధాన్యాన్ని తరలించాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కు ఆదేశించారు. రైస్ మిల్లు కు తరలించిన అనంతరం అక్కడ వేగంగా అన్లోడ్ చేసి ట్రక్ షీట్లు తెప్పించుకొని రైతులకు వేగంగా నగదు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు.(Story : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలి )

