పేదలకు సీఎంఆర్ఎఫ్ సాయంలో కూటమి ప్రభుత్వం కొత్త రికార్డులు
జీఎస్టీ 2.0తో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఊరట
అబద్ధపు ఆరోపణలు చేయకుంటే నిద్రపట్టని పరిస్థితుల్లో బొల్లా
లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో పేదలకు సీఎంఆర్ఎఫ్ సాయం అందించడంలో కూటమి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వైకాపా అయిదేళ్లలో చేసిన సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాదిన్నరలోనే అధిగమించడమే అందుకు నిదర్శనం గా పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి హామీ మేరకు కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీఎస్టీ 2.0లోసామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఎన్నో విధాలుగా ఊరట, ప్రయోజనం లభిస్తోందన్నారు. వినుకొండ నియోజకవర్గంలో అనారోగ్యం బారినపడి వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులకు తన సిఫారసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు శుక్రవారం ఆయన కొత్తపేటలోని తన కార్యాలయంలో పంపిణీ చేశారు. 49మంది లబ్ధిదారులకు రూ.31.89 లక్షల విలువైన చెక్కులు అందించారురు. అనంతరం మాట్లాడిన చీఫ్విప్ జీవీ ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1036 మందికి 7 కోట్ల 18 లక్షల 496 రూపాయల లబ్ధి చేకూరిందని చెప్పారు. గతం కంటే చాలా వేగంగా, సరళంగా సీఎంఆర్ సాయం అందిస్తున్నామనడానికి ఇదే ఉదారణ అన్నారు. అత్యవసర కేసుల్లో ముందే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేస్తున్నట్లు చెప్పారు. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న రూ.25 లక్షల ఆరోగ్య బీమాతో కిడ్నీ, లివర్, గుండె సహా ఏ అనారోగ్య సమస్య ఉన్నా కార్పొరేట్ వైద్యం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
*ప్రభుత్వ ఆస్పత్రులకు మంచి రోజులు….
కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాదిన్నరలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన వైద్యులు, సిబ్బందినీ అందుబాటులో ఉంచామన్నారు చీఫ్విప్ జీవీ. గతంలో వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి రోజుకు 20 మంది మాత్రమే వచ్చేవారని, ఇప్పుడు రోజుకు 350-400 మంది వరకు వస్తున్నారని, ఉత్తమ వైద్య సేవలు అందించి నాణ్యమైన మందులను ఇస్తున్నారన్నారు. అర్హత కలిగిన వైద్యులు మంచి వైద్యం అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
*బొల్లా వచ్చినా మంచి వైద్యం చేసి పంపిస్తాం…
కూటమి ప్రభుత్వం, తనపై, ప్రభుత్వ ఆస్పత్రులపై ఇష్టానుసారం మాట్లాడుతున్న మాజీ ఎమ్మె ల్యే బొల్లా వచ్చినా మంచి వైద్యం చేసి పంపిస్తామన్నారు చీఫ్విప్ జీవీ. బొల్లాకు గుండె, మధుమేహం, బీపీ వంటి చాలా సమస్యలు ఉన్నాయని, ఎప్పుడు వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రిలో మంచి వైద్యం అందిస్తామని చురకలు వేశారు. ప్రభుత్వ ఆస్పత్రులపై విష ప్రచారం చేయడం తగదని, బొల్లా బ్రహ్మనాయుడు రోజూ ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు తనపై అసత్య ప్రచారాలు, విమర్శలు చేస్తున్నారని, అవి చేయకపోతే ఆయనకు నిద్రపట్టదని ఎద్దేవా చేశారు.
*జీఎస్టీ 2.0తో ప్రజలకు ఎంతో ప్రయోజనం…
ఇదే సమయంలో జీఎస్టీ 2.0తో సామాన్య, మధ్యతరగతికి ఎంతో ప్రయోజనం చేకూరుతోందని అన్నారు చీఫ్విప్ జీవీ. నిత్యావసర సరకుల ధరలు తగ్గుతున్నాయని, రోజూ వాడుకునే టూత్ పేస్టులు, బ్రష్లు, సబ్బులపై 13%పన్ను తగ్గించారన్నారు. ఔషధాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5%కి తగ్గించడం ఒక ఎత్తయితే క్యాన్సర్ సహా అరుదైన వ్యాధులకు సంబంధించిన 33 రకాల ప్రాణరక్షక మందులపై పన్నును పూర్తిగా తొలగించడం చరిత్రాత్మకమని చెప్పారు. దుస్తులపై 12 శాతం పన్ను విధించేవారని, ఇప్పుడు దానిపై కూడా 7%తగ్గించారని తెలిపా రుట్రాక్టర్లపై సగటున రూ.40 వేలు, చిన్న కార్ల కొనుగోలుపై రూ.70 వేలు, ద్విచక్రవాహనాలపై రూ.8 వేల వరకు తగ్గించారన్నారు. ఏసీలపైనా పన్ను తగ్గించడంతో మధ్యతరగతీ వాటిని కొనుగోలు చేసే శక్తి పెరిగిందన్నారు. జీఎస్టీ సంస్కరణలను రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సమర్థంగా అమలు చేస్తున్నారన్నారు.(Story : పేదలకు సీఎంఆర్ఎఫ్ సాయంలో కూటమి ప్రభుత్వం కొత్త రికార్డులు )

