‘విలీన దినోత్సవం’ విషయంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ దొందు దొందే
విజయ రాములు
న్యూస్తెలుగు/ వనపర్తి : ‘విలీన దినోత్సవం’జరిపే విషయంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ దొందు దొందేనని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు విమర్శించారు. బుధవారం సిపిఐ ఆఫీస్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం వనపర్తి అంబేద్కర్ చౌక్ లో సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించారు. ముందుగా తెలంగాణ సాయుధ పోరాటయోధులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మైనుద్దీన్, దొడ్డి కొమరయ్య, ఐలమ్మ, సోయబుల్లా ఖాన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోరాట వారోత్సవాల ముగింపు సమావేశం సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములుముఖ్య అతిథిగా, అతిథిగా శ్రీరామ్ పాల్గొని మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే విలీన దినాన్ని జరుపుతామని ప్రకటించిన బీఆర్ఎస్ జరపలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విలీన దినోత్సవం జరుపుతారని ప్రజలు ఆశించారన్నారు. విలీన దినోత్సవం జరపకుండా ప్రజాపాలన దినోత్సవం పేరుతో ఈరోజు కార్యక్రమం నిర్వహించారని ఇది సరికాదన్నారు. దేశానికి ఆగస్టు 15, 19 47లో స్వాతంత్రం సిద్ధించగా తెలంగాణకు స్వాతంత్రం రాలేదన్నారు. నిజాం నవాబు పాలనలోనే తెలంగాణ కొనసాగిందన్నారు. నిజాం నవాబు, రజాకార్లు, నిజాం తాబేదారులు ప్రజల కష్టాన్ని ప్రాణమానధనాలను దోచుకున్నారన్నారు. ప్రజలచే వెట్టిచాకిరి చేయించారని, బానిసలుగా మార్చారని, తిరగబడితే చంపేశారని, మహిళలను మానభంగాలు చేశారన్నారు. నిజాం రాక్షస పాలన నుంచి తెలంగాణను ప్రభుత్వం చేసేందుకు సిపిఐ ఆధ్వర్యంలో యోధులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగించారన్నారు. గ్రామాల నుంచి నిజాం మద్దతుదారులైన దొరలను తరిమికొట్టి 3000 గ్రామాలను విముక్తం చేసిఎర్రజెండాలు పాతారన్నారు. పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని, వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించారన్నారు. సాయుధ పోరాటంలో 4500 మంది ప్రాణత్యాగం చేశారని సిపిఐది త్యాగాల చరిత్ర అన్నారు. పోరాటాలకు తలొగ్గిన నిజాం నవాబు విధిలేక తెలంగాణను సెప్టెంబర్ 17, 1948లో భారతదేశంలో విలీనం చేశారన్నారు. ఇంతటి మహత్తర ఉద్యమం ద్వారా తెలంగాణ విలీనం జరిగిందన్నారు. అందువల్ల తెలంగాణ విలీన దినోత్సవం జరపాలని సిపిఐ ఏళ్లుగా డిమాండ్ చేస్తుందన్నారు. విలీన దినోత్సవం జరపటానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారికంగా విలీన దినోత్సవం జరిపే దాకా సిపిఐ పోరాడుతుందన్నారు. నాడు ప్రజల కష్టాలను కడతేర్చేందుకు సిపిఐ సాయుధ పోరాటం సాగించిందని నాటి యోధుల స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలు ఎర్రజెండా కింద పోరాడాలన్నారు. అందుకోసం గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా గౌరవ అధ్యక్షురాలు కళావతమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు జై చంద్రయ్య, శ్రీరామ్, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, మాజీ సహాయ కార్యదర్శి ఎర్రకుర్మయ్య, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, పట్టణ కన్వీనర్ జయమ్మ, కో కన్వీనర్ శిరీష, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎత్తం మహేష్, లక్ష్మీనారాయణ, వంశీ, బుచ్చన్న, రమణ, జ్యోతి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు. (Story:’విలీన దినోత్సవం’ విషయంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ దొందు దొందే)

