సాయుధ రైతాంగ పోరాటం మహోజ్వల ఘట్టం
న్యూస్ తెలుగు/వనపర్తి : దేశ పోరాటాల చరిత్రలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మహోజ్వల ఘట్టమని, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, శ్రీరామ్ అన్నారు. సోమవారం పానగల్ మండలం కేతేపల్లి లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను నిర్వహించారు. నాటి కమ్యూనిస్టు యోధులు రావి నారాయణరెడ్డి, మగ్దుం మొహినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సోయాబుల్లాఖాన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.మాజీ సర్పంచ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్ అధ్యక్షతన సభ నిర్వహించారు. రమేష్, శ్రీరామ్ ,కళావతమ్మ మాట్లాడుతూ.. నిజాం నవాబు, రజాకార్లు, అతని తాబేదారులైన దొరలు జాగిర్దారులు భూస్వాములు ప్రజలచే వెట్టి చాకిరి చేయించారని, ప్రజల మాన ప్రాణాలను ఆస్తులను దోపిడీ చేశారన్నారు. బాంచన్ నీ కాల్మొక్త అంటూ బతికే పరిస్థితికి తెచ్చారన్నారు. భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల పెట్టి చాకిరి ముక్తి కోసం సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందన్నారు. 3000 గ్రామాలను విముక్తం చేసి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని, పోరాటంలో 4500 మంది అమరులయ్యారన్నారు. ఇంతటి ఘన చరిత్ర సాయుధ పోరాటానికి ఉందని, పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమే అన్నారు. నాటి పోరాట ఫలితమే నేటికి కూడా పెట్టి చాకిరీ లేకుండా పోయిందని, పేదలకు భూములు పంచే విధానం వచ్చిందన్నారు. నాటి పోరాటంలో ఎలాంటి పాత్రలేని బిజెపి తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించే కుట్ర చేస్తుందని తిప్పి కొట్టాలన్నారు. నిజాం వ్యతిరేకంగా పోరాడిన వారిలో ముస్లిం యోధులు మగ్దుం మహిముద్దీన్, సోయబుల్లాఖాన్ వంటి వారు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణ అమరుల పోరాటస్ఫూర్తితో దేశం రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి సిపి నేతలు కార్యకర్తలు పోరాడాలని కోరారు. ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు వంకా గోపాల్ విప్లవ గీతాలను ఆలపించి ఉత్తేజం నింపారు.ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గోపాల్, ఏఐవైఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షుడు సంతోష్, కమ్మావుల పెంటయ్య, మాల కుర్మయ్య, కాకం చిన్న రాముడు, పరశురాముడు, రామాంజనేయుడు, మద్దిలేటి, వెంకటమ్మ, శంకరమ్మ, కురువమ్మ, ఎలగొడ్డు రాముడు తదితరులు పాల్గొన్నారు.(Story : సాయుధ రైతాంగ పోరాటం మహోజ్వల ఘట్టం )

