మట్టి విగ్రహాలను వాడుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
న్యూస్ తెలుగు /సాలూరు : మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించడం వలన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం
సాలూరు పట్టణంలో ఎం ఆర్ ఓ ఆఫీస్ ఎదురుగా మెయిన్ రోడ్డు లోమట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.గణేష్ నవరాత్రి వేడుకలు అందరూ ఎంతో ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, కానీ పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాలు నీటి వనరులను తీవ్రంగా కాలుష్యం చేస్తాయని, ఆ కాలుష్యం మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గుర్తు చేశారు.
మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడడమే కాకుండా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించే అవకాశం కలుగుతుందని వివరించారు.
చిన్నారులు, యువత, మహిళలు ముందడుగు వేసి మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలని, తమ కుటుంబం నుంచి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పి, పర్యావరణహితమైన ఉత్సవాల ప్రాముఖ్యతను మరొక్కసారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, ఏఎంసి చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పాచిపెంట టిడిపి అధ్యక్షులు గూడేపు యుగంధర్,, టిడిపి నాయకులు పప్పలు మోహన్, వైకుంటపు హర్ష, కేతిరెడ్డి చంద్ర తదితరులు పాల్గొన్నారు. (Story:మట్టి విగ్రహాలను వాడుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం)
