రహదారులు బంద్ అయిన అన్ని గ్రామాలకు నిత్యవసరాలు తక్షణమే పంపిణీ చేయాలి
-కూనవరం మండలం శబరి బెల్టు గ్రామాలకు విద్యుత్ ప్రత్యామ్నాయాన్ని చూపాలి
— సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి. కిరణ్
న్యూస్ తెలుగు/చింతూరు : గత ఐదు రోజుల నుండి చింతూరు డివిజన్ 4 మండలాల్లో వరదల వలన రహదారులు బంద్ అయి అనేక గ్రామాల ప్రజలు నిత్యవసరాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే రహదారులు బంద్ అయినా అన్ని గ్రామాలకు నిత్యవసరాలు పంపిణీ చేయాలని, చిన్న పాటి వరదలకె కూనవరం మండలంలోని శబరి పరివాహక గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలుగుతున్నదని తక్షణమే దానికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి కిరణ్ డిమాండ్ చేశారు.శుక్రవారం చింతూరు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ గత ఐదు రోజుల నుండి వరద ప్రభావంతో వి ఆర్ పురం,కూనవరం, చింతూరు, ఎట్టపాక మండలాల్లో అనేక గ్రామాలు రాకపోకలు బంద్ అయి నిత్యవసరాలకు ఇబ్బంది పడుతున్నారని, ముంపు ప్రాంతాల్లో జిల్లా అధికారులు పర్యటిస్తున్న సందర్భంగా ప్రతి కుటుంబానికి 16 రకాల నిత్యవసరాలు, కొవ్వొత్తులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైన చోట మరో బొట్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. వరదల సమయంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ రహదారులు వేయాలని గతం నుండి సూచించినప్పటికీ అధికారులు ప్రభుత్వం స్పందించడం లేదని ఇప్పటికైనా ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. చిన్నపాటి వరదలకే కూనవరం మండలంలో కొన్ని గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలుగుతున్నదని గతం నుండి అక్కడ ప్రజలు కోరుతున్నప్పటికీ అధికారుల చలనం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ విద్యుత్తు లైన్ లు ఏర్పాటుచేసి విద్యుత్ అంతరాయాన్ని అధిగమించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పల్లపు వెంకట్, జిల్లా కమిటీ సభ్యులు సీసం సురేష్ మండల నాయకులు పొడియం లక్ష్మణ్, కారం నాగేష్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.(Story : రహదారులు బంద్ అయిన అన్ని గ్రామాలకు నిత్యవసరాలు తక్షణమే పంపిణీ చేయాలి )
