జిల్లాలో నూతన న్యాయస్థాన భవనం నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలి
న్యూస్తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లాలో నూతన న్యాయస్థాన భవనం నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి యం.ఆర్. సునీత జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ను కోరారు. బుధవారం ఉదయం జిల్లా న్యాయస్థానం కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మూడు కార్ పార్కింగ్ షెడ్లు, రెండవ అదనపు కోర్టు హాల్, వైద్య చికిత్సా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు డి. కిరణ్ కుమార్, ఇతర ప్రధాన న్యాయమూర్తులతో కలిసి జిల్లా సెషన్స్ జడ్జి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సెషన్స్ జడ్జి మాట్లాడుతూ న్యాయస్థానం ప్రాంగణంలో వైద్య చికిత్సా కేంద్రం ఉండటం చాలా అవసరమని, కోర్టుకు వచ్చే కక్షిదారులు, న్యాయవాదులు, ఇతర సిబ్బందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అడిగిన వెంటనే వైద్య చికిత్స కేంద్రం, కార్ షెడ్లు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేసినందుకు జిల్లా కలెక్టర్ కు కృతఙ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా జిల్లా న్యాయస్థానానికి నూతన శాశ్వత భవనం నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. బార్ కౌన్సిల్ అధ్యక్ష బాధ్యతకు తీసుకొని న్యాయస్థానంలో అవసరమున్న ఒక్కొక్క సమస్యలను పరిష్కరిస్తున్నందుకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. కిరణ్ కుమార్ వారి బృందానికి అభినందనలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోడానికి ముందస్తు వైద్య పరీక్షలు ఎంతో అవసరం అవుతాయని, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా చేసుకోవచ్చన్నారు. హెచ్.బి 1, లిపిడ్ ప్రొఫైల్ వంటి వైద్య పరీక్షలు ముందస్తుగా చేయించుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. న్యాయస్థానం ఆవరణలో వైద్య చికిత్సా కేంద్రం ఉండటం ఎంతో అవసరమని అదేవిధంగా న్యాయస్థానం ప్రాంగణంలో మౌలిక వసతుల కల్పనలు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇతర ఏ అవసరాలు ఉన్నా తప్పకుండా పరిష్కరిస్తామని తెలియజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి కిరణ్ కుమార్ మాట్లాడుతూ కోర్టు ప్రాంగణంలో కార్ పార్కింగ్ షెడ్లు నిర్మించుకునేందుకు అడిగిన వెంటనే రూ. 5 లక్షలు మంజూరు చేయడం, వైద్య చికిత్సా కేంద్రం ఏర్పాటు చేసి మంచి సీనియర్ వైద్యులు, సిబ్బందిని నియమించినందుకు జిల్లా కలెక్టర్ కు కృతఙ్ఞతలు తెలియజేశారు. కార్ పార్కింగ్ ప్రాంతంలో సి.సి. రోడ్డు వేసుకునేందుకు మరో 5 లక్షలు మంజూరు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ సెల్ న్యాయమూర్తి రజనీ,ఇతర ప్రధాన న్యాయమూర్తులు కలార్చన, కవిత, శ్రీలత, బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. (Story:జిల్లాలో నూతన న్యాయస్థాన భవనం నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలి)

