ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలాన్ని రక్షించాలని గ్రీవెన్స్ లో ఫిర్యాదు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమిని కొందరు రాజకీయ అండదండలతో స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకొని డిగ్రీ కాలేజీ స్థలాన్ని పరిరక్షించాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. 38 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూమిలో 5.10 ఎకరాల భూమికి రెవెన్యూ రికార్డులు మార్చి కాజేస్తున్నారని, ప్రభుత్వాన్ని నిషేధిత భూముల జాబితా 22(ఏ)లో సర్వే నెంబర్ 949 డిగ్రీ కాలేజీ భూమిక నమోదు కాగా, 949/1,949/2 సబ్ డివిజన్లో డీకే పట్టాగా నమోదు అయింది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు 1బి, అడంగల్ లో కొనుగోలుగా నమోదు చేశారు. 2021లో అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు డిగ్రీ కాలేజీ భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నించారు. కాలేజీ ఉద్యోగులు, విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు ప్రతిఘటించి అడ్డుకోవడమే కాకుండా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. అప్పటి కలెక్టర్ శివ శంకర్ లోతేటి స్పందించి కాలేజీలు సందర్శించి రెవిన్యూ రికార్డులు పరిశీలించారు. డిగ్రీ కాలేజీ 38 ఎకరాలు ఉందని తేల్చి చెప్పారు. కాలేజీ భూమిని కాపాడుకునేందుకు విద్యార్థి సంఘ నాయకుడు మహంకాళి సుబ్బారావు, సాగర్ లు హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇవ్వటం జరిగింది. అయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ కమిషనర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలం 38 ఎకరాలని హైకోర్టుకు నివేదిక కూడా ఇచ్చారు. కాలేజీ స్థలాన్ని సంబంధిత అధికారులు విచారించి నిగ్గు తేల్చి నివేదించాల్సిందిగా హైకోర్టు ఆదేశించారు. అయితే అమాజీ ఎమ్మెల్యేతో కొమ్మక్కైన డివిజన్, మండల రెవెన్యూ అధికారులు కలిసి 22(ఏ) జాబితాలో ఉన్న డిగ్రీ కాలేజీ భూమికి ఏకంగా కొనుగోలుగా నమోదు చేసి అక్రమదారులకు క్రయవిక్రయాలు జరుపుకునే అవకాశాన్ని కల్పించారు. దీనిపై గ్రీవెన్స్ లో విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు ఫిర్యాదు చేయగా, వినతి పత్రాన్ని స్వీకరించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూమి, 22(ఏ) జాబితాలో ఉన్న భూమికి రెవిన్యూ అధికారులు కొనుగోలుగా ఎలా నమోదు చేశారంటూ ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూమిని కాపాడాలని విద్యార్థుల విద్యార్థి సంఘ నాయకులు కలెక్టరేట్ వద్ద మోకాళ్లపై నిరసన కార్యక్రమం చేపట్టారు. అవినీతికి పాల్పడిన రెవెన్యూ అధికారులపై, అందుకు కొమ్ముగాస్తున్న ఉన్నతాధికారులు, ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (sTORY:ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలాన్ని రక్షించాలని గ్రీవెన్స్ లో ఫిర్యాదు )