భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
న్యూస్తెలుగు/వనపర్తి : భూ భారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రజలను సూచించారు.
రెవెన్యూ సదస్సులలో భాగంగా గురువారం పెబ్బేరు మండలంలోని రంగాపూర్, శ్రీరంగాపూర్ మండలంలోని నాగసాని పల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి వచ్చారని, ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకే గ్రామంలో ఉంటారు కాబట్టి ప్రజలు తమ భూ సమస్యలు ఏమున్నా నిర్ణిత ప్రొఫార్మలో పూరించి అధికారులకు ఇవ్వాలని సూచించారు. అధికారులు దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేశారు. సాదా బైనామ పై వివరిస్తూ 2020 సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వాటిని ఇప్పుడు పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని, మిగిలిన సాదా బైనామా దరఖాస్తుల విషయంలో కోర్టు నుండి సూచనలు వచ్చాక పరిశీలించడం జరుగుతుందన్నారు. పెండింగ్ మ్యుటేషన్, సక్సెషన్ వంటి సమస్యలు నోటీసులు జారి చేసి పంచనామ అనంతరం పరిష్కరిస్తారని తెలిపారు.
భూ సమస్యల పై దరఖాస్తు నింపడానికి ఇబ్బంది ఉన్న వారికి సహాయం చేసేందుకు జూనియర్ అసిస్టెంట్ లను పెట్టడం జరిగిందని, వారి సహకారం పొందాలని సూచించారు. భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకొని భూ తగాదాలు, సమస్యలు పరిష్కరించుకోవాలని గ్రామ ప్రజలను సూచించారు. జిల్లా సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, శ్రీరంగాపూర్ తహసిల్దార్ రాజు, పెబ్బేరు తహసిల్దార్ పి. మురళి, ఆర్.ఐ ఇతర సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. (Story:భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి)

