సురవరం ప్రతాపరెడ్డి జయంతి అధికారికంగా నిర్వహణకు కృషి చేస్తా
న్యూస్తెలుగు/వనపర్తి: సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన సామాజికవేత్త, కవి, రచయిత, ప్రముఖ సంపాదకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు బాషా కోవిదులు, గ్రంథాలయాల అభివృద్ధికి తపించిన సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. గురువారం రవీంద్ర భారతిలో నిర్వహించిన సురవరం ప్రతాపరెడ్డి గారి 129వ జయంతి సభలో చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ సురవరం ప్రతాపరెడ్డి గారు శతాబ్దం క్రితమే తెలంగాణ గళం గట్టిగా వినిపించారని, అన్ని సామాజిక వర్గాలలో చైతన్యాన్ని రగిల్చిన గొప్ప వ్యక్తి అని చిన్నారెడ్డి పేర్కొన్నారు. అంతటి మహనీయుని పేరును తెలుగు యూనివర్సిటీకి పెట్టిన ఘనత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని ఆయన అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి విజ్ఞప్తి చేస్తానని చిన్నారెడ్డి తెలిపారు. సురవరం గొప్ప పరిశోధకులు అని, సొంతంగా 11 వేల పుస్తకాలు సేకరించి భావి తరాల కోసం రెడ్డి హాస్టల్ లైబ్రరీలో భద్ర పర్చారని చిన్నారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వెలుదండ నిత్యానంద రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, ప్రముఖ సాహితీ విమర్శకులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి ఏనుగు నర్సింహా రెడ్డి, సురవరం కృష్ణ వర్ధన్ రెడ్డి, నిర్వాహకులు బడే సాబ్, మనోహర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, సరోజినీ దేవి, కొండా లక్ష్మీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. (Story:సురవరం ప్రతాపరెడ్డి జయంతి అధికారికంగా నిర్వహణకు కృషి చేస్తా)

