గుమ్మడి కళా పీఠం వారి ఆధ్వర్యంలో నటరత్న ఎన్టీఆర్ జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక వెల్లటూరు రోడ్డు లోని గుమ్మడి వృద్ధాశ్రమంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని గుమ్మడి కళా పీఠం ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గ కళాకారుల సమావేశం నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షులుగా విశ్రాంత ఉపాధ్యాయులు అప్ప రాజు నాగేశ్వరరావు వ్యవహరించగా ముఖ్య అతిథులుగా ప్రముఖ రంగస్థల నటుడు రామాపురం వెంకటేశ్వర్లు, హరికథ భాగవతారిణి నాగమల్లేశ్వరి కళ గురించి ఎన్టీఆర్ పాత్రల గురించి అంతర్లీన విశ్లేషణ చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులను, ఈవెంట్ ఆర్గనైజర్స్ ను ఘనంగా సన్మానించారు. అప్పరాజు నాగేశ్వరరావు మాట్లాడుతూ. సమాజాన్ని చైతన్య పరిచే బాధ్యత కళాకారులదని మిమ్మల్ని మీరే ఆవిష్కరించుకోవాలన్నారు. రామాపురం వెంకటేశ్వర్లు యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్ల గురించి పాట పాడి అలరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి దేవరపల్లి నాగేశ్వరరావు, కొర్నేపాటి నగేష్ ,రావిపాటి వీరయ్య, ముఖ్యాని రామయ్య, పారెళ్ళ విజయ్ తదితరులు పాల్గొన్నారు.(Story : గుమ్మడి కళా పీఠం వారి ఆధ్వర్యంలో నటరత్న ఎన్టీఆర్ జయంతి వేడుకలు )
