30న మంత్రి పొంగులేటి వనపర్తి పర్యటన విజయవంతం చేయాలి
న్యూస్తెలుగు/వనపర్తి : ఏప్రిల్, 30న రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వనపర్తి జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం మంత్రి వనపర్తి జిల్లాలో పాల్గొననున్న కార్యక్రమం ప్రదేశాలను, హెలిపాడ్ ను కలెక్టర్ సందర్శించారు.
అనంతరం కలెక్టర్ తన ఛాంబర్ లో అధికారులతో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. మంత్రి పర్యటన సందర్భంగా వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన పి.జి విద్యార్థుల వసతి భవనం, అధ్యాపకుల భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు. మండల అభివృద్ధి కార్యాలయ సముదాయంలో ఏర్పాటు చేసిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడే రేవల్లి, ఎదుల, శ్రీరంగాపూర్ గ్రామ పంచాయతీ భవనములకు శంఖుస్థాపన చేయనున్నారు. కె.డి.ఆర్ పాలిటెక్నిక్ కళాశాల వెనక భాగంలో ఆధునీకరించిన బి.సి. బాలుర కళాశాఖ వసతి గృహం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చెరువు సుందరీకరణ ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం కల్యాణసాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో రైతులకు భూ భారతి చట్టం పై అవగాహన ఆదస్సు, మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. (Story:30న మంత్రి పొంగులేటి వనపర్తి పర్యటన విజయవంతం చేయాలి)