అపరిష్కృత సమస్యలకు ప్రజాదర్బార్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రజా దర్బార్ సందర్భంగా ప్రజలకు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పిలుపు
న్యూస్ తెలుగు /వినుకొండ : ప్రజలకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. వచ్చే వారం నుంచి ప్రతి శుక్రవారం వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ ఉంటుందని, తానే ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన ప్రకటించారు. వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్ సందర్భంగా వెల్లడించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను నేరుగా విన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకునే దిశగా ఆదేశాలు జారీ చేశారు. వివిధ అంశాలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వీటన్నింటినీ పరిశీలించి, పరిష్కారాలు సూచించామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధికారులు, ఉద్యోగులు చొరవ చూపాలని కోరారు. ప్రజాదర్బార్ ఉన్నది ప్రజాసమస్యల పరిష్కారానికే అని, ఆ విషయం గమనించి ప్రజలు సంతోషంగా ఉండేలా అధికారులు చొరవ తీసుకుని పనిచేయాలన్నారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం ముందుండేలా చూడాలని కలెక్టర్ను కూడా కోరామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే అందరి ఏకైక అజెండా కావాలన్నారు. ప్రజాదర్బార్ నుంచి వచ్చే ప్రజల వినతులను పెడచెవిన పెట్టిన వారి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలవరం-బనకచర్లలో భాగంగా బొల్లాపల్లి వద్ద వచ్చే జలాశయంతో నియోజకవర్గం కరవు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అయిదేళ్లు పాటు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా, ఒక్క ఎకరాకు నీరివ్వకుండా రైతులకు తీరని ద్రోహం చేసిన పార్టీ వైకాపా మండిపడ్డారు. రైతుల ఆర్థిక పురోగతికే ముఖ్యమంత్రి చంద్రబాబు నదుల అనుసంధానం లక్ష్యం పెట్టుకున్నారని, బొల్లాపల్లి రిజర్వాయర్ వచ్చి పల్నాడు కరవు తీర్చడం ఆయనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ తదితరులు పాల్గొన్నారు. (Story:అపరిష్కృత సమస్యలకు ప్రజాదర్బార్ని సద్వినియోగం చేసుకోవాలి)

