రైతులు, మేధావులు సలహాలు సూచనలతోనే ప్రభుత్వం భూ భారతి చట్టం
న్యూస్ తెలుగు/వనపర్తి : రాష్ట్రంలోని రైతులు, మేధావులు, నాయకులు సహా అందరి సలహాలు, సూచనలతోనే ప్రభుత్వం భూ భారతి చట్టం – 2025 ను రూపొందించి అమలులోకి తెచ్చిందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. గురువారం ఘనపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో ‘భూ భారతి’ భూమి హక్కుల రికార్డు – 2025 చట్టం గురించి, అందులోని ముఖ్యాంశాల గురించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు భూభారతి చట్టంలోని ముఖ్యంశాలను రైతులకు వివరించారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులు, మేధావులు, నాయకులు సహా అందరి సలహాలు, సూచనలతోనే ప్రభుత్వం భూ భారతి చట్టం – 2025 ను రూపొందించి అమలులోకి తెచ్చిందని చెప్పారు. గతంలో అమల్లో ఉన్న ధరణి కారణంగా రైతులకు అనేక సమస్యలు ఎదురయ్యాయని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంతో అన్ని వివాదాలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చారని చెప్పారు. చట్టంలో ఉన్న నియమాలను అమలు చేయడంలో రెవెన్యూ అధికారులది కీలక పాత్ర అని, కాబట్టి వారు ఈ చట్టాన్ని అమలు చేయడంలో వారికి ప్రజలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా ఈ భూభారతి చట్టం ద్వారా ప్రతి ఒక్క భూమికి భుదార్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కడుపు నింపడానికి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిస్తుందని చెప్పారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు సైతం కట్టించేందుకు వేగంగా అడుగులు ముందుకు వేస్తుందని అన్నారు. రాజీవ్ యువ వికాసంతో యువతకు స్వయం ఉపాధి బాటలు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంతేకాకుండా, మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించడం, మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేయించి ఆర్టీసీ లో పెట్టించి మహిళల్ని వాటికి యజమానులను చేస్తుందన్నారు. విద్యార్థుల చదువు కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఉన్న ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల రికార్డు – 2025 చట్టాన్ని కొత్తగా తీసుకువచ్చిందని తెలిపారు. ఈ చట్టంపై రెవెన్యూ రైతులతో పాటు అందరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు.
ప్రభుత్వం ఈ నూతన చట్టం ద్వారా అనేక భూ సమస్యలకు పరిష్కార మార్గం చూపించనుందని తెలిపారు. చట్టం తో పాటు, రూల్స్ కూడా ఒకేసారి అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా తహసిల్దారు చేసిన మ్యూటేషన్లు, జారీ చేసిన పాస్ పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డిఓకు లేదా కలెక్టర్కు అప్పిలు చేసుకునేలా వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. అదేవిధంగా వారసత్వంగా సంక్రమించే భూముల మ్యూటేషన్ల విషయంలో నోటీసులు జారీ చేయాల్సిన ప్రక్రియపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. భూ భారతి చట్టం- 2025 ప్రకారం ఒకేరోజు రిజిస్ట్రేషన్ తో పాటు మ్యుటేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్క భూకమతానికి యూనిక్ ఐడి భూదార్ ఇవ్వడం గురించి కూడా తెలియజేశారు. డీసీసీబీ ఛైర్మన్ మాట్లాడుతూ ధరణిలో లొసుగులు నివారించి, భూ వివాదాలకి పరిష్కారం చూపించడం కోసమే ప్రభుత్వం ఈ భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులు, మేధావులు సహా అందరి సలహాలు, సూచనలతోనే ప్రభుత్వం భూ భారతి చట్టం – 2025 ను రూపొందించి అమలులోకి తెచ్చిందని చెప్పారు. భూ భారతి చట్టం- 2025 ప్రకారం ఒకేరోజు రిజిస్ట్రేషన్ తో పాటు మ్యుటేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్క భూకమతానికి యూనిక్ ఐడి భూదార్ ఇవ్వడం గురించి కూడా తెలియజేశారు. ఈ సందర్బంగా అధికారులు భూ భారతి చట్టం పై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఘనపూర్ పి ఎ సీ ఎస్ ఛైర్మన్, డి వై ఎస్ ఓ సుదీర్ రెడ్డి, తహసీల్దార్ సద్గుణ, ఇతర అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.(Story : రైతులు, మేధావులు సలహాలు సూచనలతోనే ప్రభుత్వం భూ భారతి చట్టం )
